మెహిదీపట్నం జూలై 18: చారిత్రాత్మక గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం లక్షలాదిగా ప్రజలు తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నది. కోటలోని రాణిమహల్, నగీనా బాగ్, క్లాపింగ్ పోర్టికో, రాజ్ మహల్, రామదాసు చెరసాల.. ఇలా ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. నగరం నలుమూలల నుంచి 20 వరకు తొట్టెలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో సమర్పించారు. సాయంత్రం వర్షం కురిసినా లెక్కచేయకుండా భక్తులు అమ్మవారికి బోనాలను నైవేద్యంగా పెట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ ట్రస్ట్ చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్, ఆలయ ఈవో ఎస్.మహేందర్కుమార్, సలహాదారు సిరుగుమల్లె రాజువస్తాద్, గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అనేక ఏర్పాట్లు చేశారు. అంతేకాక జలమండలి డీజీఎం వికాస్, మేనేజర్ సాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బి.నర్సింగ్రావు భక్తులకు తాగునీటిని అందించారు. ప్రవేశ ద్వారం వద్ద మాస్కులు అందజేసి శానిటైజ్ చేశారు. కోటలోని నగీనాబాగ్లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా భక్తులను ఉర్రూతలూగించింది.
ఆషాఢ మాసం మూడో బోనం సందర్భంగా గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నగర మేయర్ విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్, ఆలయ ఈవో ఎస్.మహేందర్కుమార్, ట్రస్టు సభ్యులు శ్రీధర్, హేమలత, వెంకటేష్యాదవ్, స్వరూపారాణి, సాయియాదవ్ మేయర్కు స్వాగతం పలికారు. ఆలయ పూజారి సర్వేశ్వర్ చారి ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ బోనాల పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.
మూడో బోనం సమర్పణ సందర్భంగా గోల్కొండ కోటకు భారీగా భక్తులు తరలిరాగా ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. లంగర్హౌస్ నుంచి బడాబజార్, చోటా బజార్ మీదుగా రాందేవ్గూడ నుంచి కోట వరకు, సెవన్ టూంబ్స్ నుంచి కోట వరకు ఉన్న రహదారులు భక్తులతో నిండిపోయాయి.
జగదాంబిక ఎల్లమ్మకు మూడో బోనం సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పించారు. లంగర్హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపుకు లంగర్హౌస్ బస్తీ సంక్షేమ సంఘం, బీజేపీ యువమోర్చా, హరిదాస్ పురా బస్తీ సంక్షేమ సంఘం, ముదిరాజ్ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్వాగత వేదికలను ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు.
కొండాపూర్, జూలై 18: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఐటీ కారిడార్లోని
చిన్న పెద్దమ్మ తల్లికి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)
ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ 2013 నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి బోనంతో పాటు పట్టుచీర, ఒడిబియ్యం సమర్పించామన్నారు. ఐటీలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకోవాలని మొక్కుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీటా సభ్యులు రాణా ప్రతాప్, అశ్విన్ చంద్ర, నవీన్ చింతల, రవి లెల్ల, శ్రీలత, భాగ్య, నవీన్, భాగ్య, దీపిక జోషి, శ్రీలత చింతల, సౌమ్య, శ్రావణి, రోష్ని,
గాయత్రి, పూజ, శ్రీవిద్య పాల్గొన్నారు.
బేగంపేట, జూలై 18: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. ప్రతి ఆషాఢ మాసంలో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం కుటుంబ సభ్యులు బోనం తయారు చేసి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, జోగిని శ్యామల పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగిని శ్యామల అమ్మవారి బోనాన్ని తలపై పెట్టుకొని చేసిన విన్యాసాలు కనువిందు చేశాయి.