చాంద్రాయణగుట్ట/చార్మినార్, ఆగస్టు 1 : పాతనగరం భక్తిభావంతో ఉప్పొంగింది. తీన్మార్ వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలతో పులకించింది. పాతనగరంలో ప్రసిద్ధి చెందిన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి నిర్వహించిన పూజల్లో సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, హరిబౌలి బంగారు మైసమ్మ, అక్కన్నమాదన్న, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, డి.కె.అరుణ, అంజన్కుమార్ యాదవ్, మహిళా విభాగం టీపీసీసీ అధ్యక్షురాలు సునీతారావు, మధుయాష్కీలు అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. మేకలబండ శ్రీ మహంకాళి అమ్మవారిని తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డి.కె.అరుణ, రఘనందన్రావులు దర్శించుకున్నారు. లాల్దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి సీపీ అంజనీకుమార్ బంగారు బోనం సమర్పించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీసీ చౌహాన్, షీ టీం అదనపు కమిషనర్ షీకా గోయల్, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ బందోబస్తును పర్యవేక్షించారు.