చార్మినార్/చాంద్రాయణగుట్ట/అబిడ్స్/మెహిదీపట్నం, జూలై 15: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. శనివారం లాల్దర్వాజా అమ్మవారిని ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సహకరిస్తుందన్నారు. బోనాల పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ శనివారం దర్శించుకున్నారు.
జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి లాల్దర్వాజా సింహవాహినీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు కాశీనాథ్గౌడ్, విష్ణుగౌడ్, పొన్న సదానంద్తోపాటు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాధిఖ్అలీ, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 115వ వార్షికోత్సవ బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి భక్తులు, దాతల సహకరంతో ఆలయ ప్రతినిధులు అర కిలో బంగారు ఖడ్గంను చేయించారు. శనివారం లాల్దర్వాజ కోటమైసమ్మ దేవాలయంలో ఖడ్గంకు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆదివారం బోనాల సమర్పణ, సోమవారం సామూహిక ఘటాల ఊరేగింపు జాతరకు భారీ సన్నాహాలు చేస్తున్నామని ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తరుపున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ, చైర్మ న్ శ్రీరాంబాబు శనివారం సుల్తాన్షాహి శ్రీ జగదాం బ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ అధ్యక్షుడు రాకేష్ తివారి శాలువాకప్పి మర్యాదపూర్వకంగా సన్మానించారు.
బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుగాను ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోషామహల్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని అమ్మవారి ఆలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు, సోమవారం గావురంగం, ఫలహారం బండ్ల ఊరేగింపు, బలిగంప కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాలకు పట్టువస్ర్తాలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలలో ఆషాఢ మాసం బోనాలను ఆదివారం నిర్వహించనున్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్హౌస్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్, రాందేవ్గూడ, నానల్నగర్, టోలిచౌకి, గుడిమల్కాపూర్ ప్రాంతా ల్లో ఆలయాలను బోనాలకు సిద్ధం చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్హిల్స్, ఆసిఫ్నగర్, మెహిదీపట్నం, అహ్మద్నగర్, విజయ్నగర్ కాలనీ, మల్లేపల్లి, గుడిమల్కాపూర్ డివిజనల్లోని అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.