బోడుప్పల్, నవంబర్ 13: బోడుప్పల్ వక్ఫ్ బోర్డు సమస్య మీది కాదు. ఇకపై నాది.. అంటూ రాష్ట్ర మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి బాధితులతో అన్నారు. ఆర్ఎన్ఎస్ కాలనీలో బోడుప్పల్ వక్ఫ్బోర్డు జాక్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సభకు మేయర్లు బుచ్చిరెడ్డి, జెక్క వెంకట్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారత, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి చొరవతో వక్ఫ్ బోర్డు సమస్య కొలిక్కి వచ్చిందటూ మంత్రి పేర్కొన్నారు. పేదల పక్షాన జేఏసీ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో పోరాట పటిమ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తీరును మంత్రి కేటీఆర్ కొనియాడారన్నారు. ఏడువేల కుంటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులను విన్న కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. వక్ఫ్బోర్డుపై ఇచ్చిన గెజిట్ను డీ నోటిఫై చేసేవరకు విశ్రమించనని, పట్టువదలని విక్రమార్కుడినని బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ప్రతి పైసా ఖర్చును కూడా తానే భరిస్తానని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో ‘జై మల్లన్న.. జైజై మల్లన్న…’ అన్న నినాదాలు సభలో మార్మోగాయి.
బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితులకు సమస్యలు తొలగిపోయాయని, నేటి నుంచే రిజిస్ట్రేషన్లు, ఇంటి అనుమతుల మంజూరు పక్రియ ప్రారంభమైనదని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు చేసే పోరాటంలో మీతో పాటే నేనుంటాని శపధం చేస్తున్నానని మంత్రి ప్రకటనతో కాలనీవాసులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సమస్య పరిష్కారానికి మిగిలిన లీగల్టీ పనులను త్వరలో పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా కారు గుర్తుకు ఓటేసి భారీ మోజారిటీ ఇవాల్సిందిగా బోడుప్పల్ వక్ఫ్బోర్డు బాధితులను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో జంట కార్పొరేషన్ల మేయర్లు బుచ్చిరెడ్డి, జక్క వెంకట్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, స్థానిక కార్పొరేటర్లు పద్మారెడ్డి, చీరాల నర్సింహ, చందర్ గౌడ్, బొమ్మక్ సుగుణ బాలయ్య, సుమన్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు దత్తాత్రేయ శాస్త్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు కొత్త రవిగౌడ్, బందారం నగేశ్, ఉప్పరి విజయ్, కీర్తన్ రెడ్డి, అలీం, మోతె రాజు, శ్రీనివాస్ గుప్త కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బోడుప్పల్ వక్ఫ్బోర్డు సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, అధికారులు సానుకూలంగా స్పందించడం సంతోషకరమని, బోడుప్పల్ వక్ఫ్బోర్డు బాధితులు నేడు దీపావళి రోజని బోడుప్పల్ వక్ఫ్బోర్డు జేఏసీ కన్వీనర్ శ్రీధర్రెడ్డి, కో కన్వీనర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడువేల కుటుంబాల బాధితులతో మంగళవారం సమావేశం ఏర్పాటుచేసి బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితులు వేసిన 88 నామినేషన్లను ఏకగ్రీవ తీర్మానం చేసి వెనక్కి తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ శ్రీధర్రెడ్డి స్సష్టం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందంటూనే సమస్యను నాన్చివేసే ధోరణి పురనావృత్తమైతే రానున్న ఎన్నికల్లో మళ్లీ ఉద్యమిస్తామని జాక్ ప్రతినిధులు స్పష్టం చేశారు.