కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 26 : కూకట్పల్లిలో బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్కల్యాణ్ హాజరైన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి మెట్రో ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభకు బీజేపీ, జనసేన పార్టీల నేతలు పరువు దక్కించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి డబ్బులు వెచ్చించి జన సమీకరణ చేసినప్పటికీ.. ఆ ప్రాంగణంలో కనీసం కుర్చీలు కూడా నింపలేని పరిస్థితి నెలకొంది. సినీనటుడైన జనసేన అధినేత పవన్కల్యాణ్ను చూసేందుకు జనాలు వస్తారని భావించారు. అయినా.. సభలో కనీసమైన జనాలు కనిపించలేదు. జన సమీకరణ లేదని.. వస్తే పరువు పోతుందని తెలుసుకున్న బీజేపీ అధినేత అమిత్షా అకస్మాత్తుగా సభకు రావడం లేదని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు సభాప్రాంగణంలోని కుర్చీలను విరగొట్టి.. బారీకేడ్లను పడగొట్టి నిరసన తెలిపారు. పవన్కల్యాణ్, జేపీ నడ్డా మాట్లాడినా.. వారి మాటలు పట్టించుకోకుండా సభాప్రాంగణం నుంచి వారంతా వెళ్లిపోయారు. జాతీయ నాయకులు, సినీ గ్లామర్ను ఉపయోగించి బహిరంగ సభను విజయవంతం చేద్దామనుకున్న జనసేన అభ్యర్థికి ఎన్నికలకు రెండ్రోజుల ముందే ఓటమి ఖాయమని తెలిసిపోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు.. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా.. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా.. అని పక్కనున్న బీజేపీ, జనసేన నేతలతో వాపోయినట్లు తెలిసింది.