సుల్తాన్బజార్, మే 20: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ గౌరవ అధ్యక్షురాలు ప్రేమ పావని, అధ్యక్షురాలు పడాల నళిని, ప్రధాన కార్యదర్శి ఎస్ ఛాయాదేవి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం భారత జాతీయ మహిళా సమాఖ్య పిలుపుమేరకు ఎంపీ బ్రిజ్ భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ… దేశ వ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సేకరించిన సంతకాలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత మల్లయోధులు ఒలింపిక్స్లో దేశానికి బంగారు పతకాలను సాధించడంలో చేసిన కృషి అభినందనీయమన్నారు.
అటువంటి మల్లయోధులకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రోత్సాహాన్ని అందించడం పోయి లైంగిక వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. ఈ విషయాన్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలని మహిళా మల్లయోధులు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో గత నెల 23 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేస్తున్న పోరాటానికి మద్దతుగా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదులు, వివిధ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయన్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యం చేస్తున్నదని, దీని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ బ్రిజ్ భూషణ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి పోస్కో, పోస్ట్ చట్టాల కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.