BJP | స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసం చేస్తూనే ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రను హైదరాబాద్లోని పాతబస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. క్రమ శిక్షణ లేకుండా ఉచితాల పేరుతో దేశంలో ఓట్లు దండుకునే కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో గారడీ చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు.
ఎన్నికల సమయంలో అందరికీ ఉచితాలు అని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు షరతులు విధిస్తుండటం ప్రజలను మోసం చేయడమే అని లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం, మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. పదేండ్లు అధికారానికి దూరంగా ఉండి.. ఒక్కసారిగా అధికారంలోకి రాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. ప్రపంచ దేశాలు సైతం మోదీ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు.