రాజకీయ లబ్ధి కోసమే బండి సంజయ్ వ్యాఖ్యలు
దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలి
బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు : ఎమ్మెల్యే సాయన్న
సికింద్రాబాద్, మే 26 : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకోవడం దుర్మార్గమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మండిపడ్డారు. ఇకనైనా నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యే సాయన్న ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. తెలంగాణలోని మసీదులన్నింటినీ తవ్వాలని.. అందులో శవం వస్తే మీదని, శివలింగం వస్తే తమదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్న తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. తెలంగాణలో ఇప్పటి వరకు మతకలహాలు లేవని, ఇకపై కూడా రాష్ట్రం ప్రశాంతంగానే ఉండాలని చెప్పారు. మత కలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని, దీనికి గుజరాత్ ఉదాహరణ అన్నారు. మసీదులను తవ్వడాన్ని పక్కన పెట్టి, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడంపై బండి సంజయ్ దృష్టి సారించాలన్నారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. దేవున్ని గుండెల్లో పెట్టుకొని పూజించే నైజం మాదైతే, ఆ దేవున్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసేది బీజేపీ అని ప్రజలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ అని దేశం భావిస్తున్నదని, దేశంలోని అన్ని సహజ వనరుల్ని సంపూర్ణంగా వినియోగించే సమర్థ నాయకత్వం కేసీఆర్ది మాత్రమేనని స్పష్టం చేశారు.