కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 1 : బీజేపీ, జనసేన పొత్తు కూకట్పల్లి బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామాకు దారితీసింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గాన్ని జనసేకు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో… బీజేపీ టికెట్ ఆశావహులంతా ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూకట్పల్లి బీజేపీ ఆశావహులు, ముఖ్య నేతలంతా ఆందోళన నిర్వహించి బీజేపీకే టికెట్ కేటాయించాలని ఆందోళన నిర్వహించారు. అయినా అధిష్ఠానం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ టికెట్ ఆశిస్తున్న కాంతారావు, వడ్డెపల్లి రాజేశ్వర్రావులతో పాటు ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నేతలు బుధవారం మూకుమ్మడి రాజీనామా పత్రాన్ని అధిష్ఠానానికి పంపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించామని తెలిపారు. ఆయా సంస్థలు నిర్వహించిన సర్వేలో సైతం బీజేపీయే రెండోస్థానంలో బీఆర్ఎస్కు పోటీ ఇస్తుందని తేలిందన్నారు. కానీ.. కనీసం పోటీనిచ్చే నాయకులు లేని జనసేనకు టికెట్ కేటాయిస్తే బీజేపీ నేతలు సహకరించేది లేదని తెలిపారు. ఇది ఇలా ఉండగా..కూకట్పల్లిలో పోటీ చేసేది జనసేన అభ్యర్థేనని ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.