సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తేతెలంగాణ): ‘గతానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నగరాభివృద్ధి బేరీజు వేసుకోండి. ఎంతో మార్పు జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ అయ్యింది. గ్రేటర్ గులాబీ సైన్యం అహర్నిశలు శ్రమిస్తోంది. ఇంకా శక్తివంచన లేకుండా వచ్చే సాధారణ ఎన్నికల్లో నగరంలోని అన్ని స్థానాలు గెలుచుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురేలా కార్యకర్తలు పనిచేయాలి. శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. ప్రతీ కార్యకర్తకు అండగా నిలుస్తా’ అని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హైదరాబాద్ ప్రగతి, పార్టీ పటిష్టతపై కార్యాచరణ ప్రణాళిక, వచ్చే ఎన్నికల్లో వ్యూహం, కమిటీల నియామకాలు తదితరాంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే…
నగరానికి ఆయన ఏం చేసిండో చెప్పాలి
సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన కిషన్రెడ్డి నగరానికి ఒరగబెట్టిందేమీ లేదు. తనను గెలిపిస్తే నియోజకవర్గ కాపలాదారుగా ఉంటా అన్నారు. గెలిచి కేంద్రమంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ను మరిచిపోయారు. రెండున్నరేండ్లుగా ఆయన సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయలేదు. దమ్ముంటే ఫలానా అభివృద్ధి చేశానని చూపించాలి. కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నా ప్రజల తరపున మాట్లాడడం మర్చిపోయారు. రాజకీయంగా అసత్య ఆరోపణలకే పరిమితమయ్యారు. ఆ పార్టీ నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచి హైదరాబాద్కు నిధులు తీసుకురావాలి.
దమ్ముంటే ఆ రాష్ర్టాల్లో ప్రకటించాలి
రాష్ట్రంలో వినూత్న పథకాలు అమలవుతున్నాయి. వీటిని కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారు. కేంద్రానికి దమ్ముంటే ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, దళితబంధును ప్రకటించాలి. 29 రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఆదర్శవంత పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, వారి కుటుంబంపై బీజేపీ నేతలు అవాకులు,చెవాకులు పేలుతున్నారు. వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు స్థానం ఉండదు.
ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా
నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషంగా ఉన్నది. జిల్లా పదవి రావడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. నామీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సీఎం కేసీఆర్,వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కృతజ్ఞతలు. పార్టీ ఇచ్చిన బాధ్యతను సామాన్య కార్యకర్తలా నిర్వర్తిస్తా. పదవులు కాదు..పార్టీనే సుప్రీం.
సమన్వయంతో ముందుకు సాగుతా..
జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకు కొత్త కాదు. మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ జిల్లా నేతలతో మంచి పరిచయాలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కలుపుకొని పార్టీ కార్యక్రమాలు చేపడతా. అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముందుకెళ్తా. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా.
జిల్లాలో అత్యంత బలంగా పార్టీ
జిల్లాలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. వరుసగా రెండుసార్లు బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురవేశాం. ఏడుగురు ఎమ్మెల్యేలతో పటిష్టంగా ఉన్నాం. ఏ పార్టీ లేని విధంగా బలమైన క్యాడర్, అన్నింటికి మించి ప్రజలు టీఆర్ఎస్ను ఇంటిపార్టీగా ఆదరిస్తున్నారు. సభ్యత్వాల డ్రైవ్ ఇందుకు తార్కాణం. పార్టీ పనితీరు, నాయకుల వ్యవహారాన్ని బాధ్యతగా స్టేట్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తా. రానున్న రోజుల్లో ఎదురు లేని శక్తిగా మార్చేందుకు కృషి చేస్తా. సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి పనిచేస్తా. కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో మరింత భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తా.
కష్టపడే వారికి తప్పక గుర్తింపు
త్వరలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. పార్టీ అధినేత,సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీల నియమాకంపై రెండురోజుల్లో స్పష్టత వస్తుంది. కష్టపడే ప్రతి కార్యకర్తను తగిన పదవితో గౌరవించుకుంటాం. ఓపికతో పనిచేస్తే నాయకత్వం గుర్తిస్తుంది.
నిధులు కేటాయించకుంటే కిషన్రెడ్డిని తిరగనియ్యం
కేంద్ర బీజేపీ సర్కారు రాష్ట్రంపై ఆది నుంచి తీవ్ర వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణి అవలంభిస్తూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రగతికి మోకాలడ్డుతున్నది. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే రక్షణ స్థలాలు అప్పగించడంలో తాత్సారం చేస్తోంది. నగరాభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేతలను నగరంలో తిరగనివ్వం. బీజేపీ తీరును అడుగడుగునా ఎండగడుతాం.