చిక్కడపల్లి,జనవరి17: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 19న కార్మిక, కర్షక ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. సోమవారం రైతు సంఘం కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడేండ్లు గడుస్తుందన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలన్నారు. దేశంలోని రైతులకు రుణ మాఫీ చేయకుండా కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటీకరించడం ధనవంతులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 19న జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.