బడంగ్పేట, ఆగస్టు 26: మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లచ్చా నాయక్ నియమితులుగా కాగా, శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేని ప్రధాని అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య అంతరాలు సృష్టించాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల ప్రలోభాలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలన్నారు. మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తదితరులు హాజరయ్యారు.