మేడ్చల్ జోన్ బృందం, సెప్టెంబర్ 9: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ త్రైలోక్య మోహన్ చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి-కల్పన దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రితో కేక్ కట్ చేయించారు. ఘనంగా మంత్రిని సన్మానించి , జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లోని అనాథ, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహణ, ఆలయాల్లో పూజలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభివాణి, ఎమ్మెల్యేలు సుభాష్రెడ్డి, వివేక్ బీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహందర్ రెడ్డి, చామకూర భద్రారెడ్డి, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి జన్మదినం సందర్భంగా కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జవహర్నగర్లోని ఆదర్శ ఓల్డేజ్హోంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమానికి మేయర్ మేకల కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 26వ డివిజన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మండల బీఆర్ఎస్ నాయకులు భరత్రెడ్డి చిట్టిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధి కాచవానిసింగారం లోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం చౌదరిగూడ లోని అనాథాశ్రమంలోని వృద్ధ్దులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు లక్ష్మి, పవన్, రాఘవేంద్ర, బాలచందర్, జనార్దన్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.