శేరిలింగంపల్లి, డిసెంబర్ 27: ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అన్నదమ్ములను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి దాదాపు రూ.8 లక్షల విలువైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన చాకలి నవీన్ (25), చాకలి ప్రవీణ్(22) సోదరులు. నగరానికి వలసవచ్చి జగద్గిరిగుట్టలోని ఆల్విన్కాలనీలో ఉంటున్నారు.
నవీన్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్గా, ప్రవీణ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు అన్నదమ్ములిద్దరూ కలిసి ద్విచక్ర వాహనాల చోరీ చేయడం మొదలుపెట్టారు. లోన్ రికవరీ ఏజెంట్గా పని చేస్తున్న నవీన్ వద్ద.. సంస్థకు డబ్బులు చెల్లించని వారి జాబితా ఉంది. ఆ జాబితా సహాయంతో వాయిదాల ప్రకారం లోన్ డబ్బులు చల్లించని వాహనాలను టార్గెట్ చేసుకొని చోరీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గచ్చిబౌలిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన నవీన్, ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా..
అసలు విషయం బయటపడింది. చోరీ చేసిన 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదరులైన నవీన్, ప్రవీణ్ను అరెస్టు చేసిన పోలీసులు, మంగళవారం రిమాండ్కు తరలించారు. అయితే, చాకలి నవీన్ 2016లో కూడా లంగర్హౌజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. ఈ కేసులోజైలుకు వెళ్లివచ్చాడని డీసీపీ తెలిపారు. అయినా, అతడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఈ మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు, రాయదుర్గం సీఐ మహేశ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.