Hyderabad | ఆన్లైన్లో గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. కానీ పోలీసుల రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్లో ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపింది. తన ఇంట్లో దొంగలు పడ్డారని ఓ యువతి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాను వాష్రూమ్కి వెళ్లిన సమయంలో కొంతమంది దొంగలు ఇంట్లోకి ప్రవేశించారని సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఇంట్లోని వస్తువులను, బీరువాలోని బట్టలను చిందరవందరగా పడేసి.. బీరువాలోని బంగారం, డబ్బును ఎత్తుకెళ్లారని పేర్కొంది. వారిని పట్టుకోబోయే క్రమంలో తనను తోసేసి ఇంట్లో నుంచి పారిపోయారని తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయం తెలిసింది.
పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతి..
రాజేంద్రనగర్లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి.. పరారైన దుండగులు.
కట్ చేస్తే…..
యువతి స్కెచ్ బెడిసికొట్టింది… pic.twitter.com/Ik9zhPtNTS— Telugu Scribe (@TeluguScribe) April 11, 2024
ఆన్లైన్ గేమ్ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి.. ఇంట్లో తెలిస్తే తిడతారని ఇలా చోరీ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ డ్రామా ఆడినందుకు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పోగొట్టుకుని.. ఇంట్లో తెలిస్తే తిడతారని సదరు యువతి ఇలా చోరీ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు.