భాగ్యనగరం చారిత్రక సౌందర్యానికి ప్రతీక. వందల ఏండ్ల చరిత్రకు నిలువుటద్దం.. ఎన్నో అద్భుతమైన కట్టడాలు, సృజనాత్మక, కళాత్మక నిర్మాణాలకు సాక్షీభూతం. అలనాటి సంపదలో అత్యంత ప్రాధాన్యం ఉన్నవి మెట్ల బావులే. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన వీటిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నది. పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్ది.. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో కుతుబ్షాహీ టూంబ్స్ మెట్ల బావుల వైభవం విశ్వఖ్యాతికినోచుకున్నది. యునెస్కో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ పురస్కారానికి ఎంపికైంది. యునెస్కో ఏషియన్, పసిఫిక్ విభాగంలో 11 దేశాల నుంచి 50 ఎంట్రీలు రాగా, డిస్టింక్షన్ కేటగిరీలో కుతుబ్షాహీ టూంబ్స్లోని ఆరు మెట్ల బావులు స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం.
– సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం
విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలం దక్కన్ పీఠభూమి. అందునా తెలంగాణ సంస్కృతి మరింత ప్రత్యేకం. ఎందరు వచ్చిన తల్లిలా ఆదరించి అక్కున చేర్చుకునే నెనరుగల్ల భూమి, అనురాగాలు ఆప్యాయతలు పంచే మనసున్న గడ్డ తెలంగాణ. చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత.. సహజ జలవనరులు, దట్టమైన అడవులు, అబ్బురపరిచే ప్రాచీన రాతికట్టడాలు, కొండ కోనలు, కోటలు, అడుగడుగునా గుడి, ఆధ్యాత్మిక క్షేత్రాలు, తరగని గనులు, పసిడి సిరులు కురిపించే మాగాణం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సబ్బండ వర్ణాల సహజీవనం, ఒకటేమిటి వేల ఏండ్ల చరిత్రను తన గర్భంలో దాచుకున్న తెలంగాణ నేలతల్లి.. వైవిధ్యమైన జీవావరణంతో భిన్న సంస్కృతులకు అద్దంపడుతున్నది.
ఒక్క మాటలో కోటి రతణాల వీణ నా తెలంగాణ అన్న మహాకవి దాశరథి మాటలు సదా స్మరణీయం. కాగా, శనివారం గోల్కండ మెట్లబావికి యునెస్కో గుర్తింపునివ్వడాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షిస్తున్నది. ఐతే ఈ సందర్భంలో ఇంతటి ఘనమైన చరిత్ర కలిగి అన్ని అర్హతలు ఉన్న తెంగాణలోని ఇతర చారిత్రక కట్టడాలకు కూడా గుర్తింపు లభించాలి. అది న్యాయమైన డిమాండ్ కూడా. అయితే యునెస్కో ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారొత్సవాలు 2022 నిర్వహిస్తున్నది.
ఈ నేపథ్యంలో మన చారిత్రక వైభవానికి ప్రతీకలుగా నిలిచిన గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్మినార్ తదితర కట్టడాలకు సముచిత గౌరవం దక్కాల్సిందేనని చరిత్రకారులు, పరిశోధకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. మన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన వారసత్వ సంపదను ఈ సందర్భంగా మరోసారి పరామర్శించుకుందాం.
తరగని చరిత్రకు పేరెన్నికగన్న తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్కన్ ప్రాంతంలో టన్నుల కొద్దీ చరిత్ర, సాంస్కృతిక వైభవం కలిగి, గంగాజెమునా తెహజీబ్ సంస్కృతి పరిఢవిల్లిన నేల ఇది. ఎంతో వైవిధ్యానికి పేరొందిన తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలకు సరైన గుర్తింపు రావాలని, చారిత్రక సౌధం గోలొండ కోటకు ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కాల్సిందేనని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు చార్మినార్, కుతుబ్షాహీ టూంబ్స్కు ఉమ్మడిగా స్థానం దక్కాల్సిందేనని.. ఇప్పటికే గత ప్రభుత్వం యునెస్కోకు పంపిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఇవేకాకుండా అనేక చారిత్రక రాతి శిలలు హైదరాబాద్ చుట్టుముట్టూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాలు, కోటలు, పర్యాటక ప్రాంతాలు సైతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని వాటికి సైతం సరైన గుర్తింపు దక్కాలని పలువురు చరిత్రకారులు, పరిశోధకులు గుర్తు చేస్తున్నారు.
2010లోనే నగరంలోని చార్మినార్, కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ కోటకు యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడాల స్థానంలో గుర్తింపు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కొన్ని కారణాల వల్ల చార్మినార్ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలువలేక పోగా 2014లో తిరిగి మరోసారి యునెస్కోకు లేఖ రాసినా నిష్ప్రయోజనమైంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని పరిశోధకులు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ కట్టడాలకు, చారిత్రక ప్రాంతాలకు కొదవలేదు. అనేక ప్రాంతాల్లో ఓన్నో విశిష్టతలు, పురాతన అంశాలతో కూడిన అనేక రాతికట్టడాలు ఉన్నాయి. ఇప్పటికే దక్కన్ హెరిటేజ్ గుర్తింపు రావాల్సి ఉండె. కానీ అనుకున్నస్థాయిలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకోవాల్సి ఉండింటే బాగుండేది. భువనగిరి గుట్ట, కరీంనగర్లోని బొమ్మలగుట్ట లాంటి అనేక రాతిశిలలను కూడా వారసత్వ సంపదగా గుర్తించొచ్చు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు, పౌరసమాజం కూడా వారసత్వ ప్రదేశాల సంరక్షణకు కృషి చేయాలి.
-మణికొండ వేదకుమార్,
చైర్మన్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్
గ్రేటర్ హైదారాబాద్కే కాదు దక్కన్ భూభాగంలో గోల్కొండ కోట తలమానికంగా పేరొందింది. నవాబుల చారిత్రక సౌధాన్ని తెలంగాణ పభుత్వం పరిరక్షించేందుకు ఇప్పటికే కృషి చేస్తుండటం అభినందించాలి. నగర పర్యాటలకుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల వారితోపాటు విదేశీ పర్యాటకులు గోల్కొండను సందర్శించి చారిత్రక అంశాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్కు శివారులోనే కోట ఉండటంతో పర్యాటలకుందరూ సందర్శించేందుకు మక్కువ చూపుతారు. ఇక యూనెస్కో వారసత్వ సంపద జాబితాలో చేరితే మరింత అభివృద్ధితోపాటు గోల్కొండ కోటను తీర్చిదిద్దేందుకు అవకాశం దొరుకుతుంది.
– అడపా సత్యనారాయణ,
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి పకనే కోటగడ్డగా పిలుచుకునే 85 ఎకరాల మట్టి దిబ్బల కింద శాతవాహన కాలపు వైభవం దాగి ఉన్నది. 1900 సంవత్సరంలో హెన్రీ కౌసెన్స్ ఇకడ ‘ఒక ప్రాచీన నగరం’ ఉందని, అంతకంటే ముందే మధ్య రాతియుగం, కొత్త రాతియుగం ఆనవాళ్లు కూడా ఇకడ ఉన్నాయని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వ ఆరియాలజీ శాఖ 1937లో ఖ్వాజా మహ్మద్ అహ్మద్ నేతృత్వంలో పరిశోధన జరిపారు. 1940-42 మధ్య తవ్వకాలు జరిగాయి. మళ్లీ 2009-2011 మధ్య ఆరియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపింది. మొదటి తవ్వకాల్లో దొరికిన అవశేషాలు ఇప్పుడు కొండాపూర్లోని సైట్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక నిర్మాణాలు, బౌద్ధ స్థూప, చైత్యాల ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిపై క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి బ్రహ్మీ లిపి అక్షరాలున్నాయి. ఇకడ దొరికిన చైత్యం, స్థూపం, బుద్ధుడి పాదాలు, కుండపై త్రిరత్న ముద్ర వంటి ఎన్నో బౌద్ధ అవశేషాలు దొరికాయి.
చారిత్రక, వారసత్వ కట్టడాలైన కుతుబ్షాహీ టూంబ్స్ మెట్ల బావులకు శనివారం అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. యునెస్కో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డులు మెట్లబావులను వరించాయి. యునెస్కో ఏషియన్ పసిఫిక్ విభాగంలో 11 దేశాల నుంచి 50 ఎంట్రీలు రాగా.. డిస్టింక్షన్ కేటగిరిలో మూడు దేశాలకు.. అందులో కుతుబ్షాహీ టూంబ్స్లోని ఆరు మెట్ల బావులు స్థానాన్ని సంపాదించుకున్నాయి. భవిష్యత్తులో మరిన్ని చారిత్రక కట్టడాలకు గుర్తింపు రావడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
చారిత్రక నగరం హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది చార్మినార్. నాలుగు మినార్లు కలిగిన స్మారక చిహ్నం నిర్మాణంతో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా అవతరించిందనడంలో సందేహం లేదు. అతి ప్రాచీన చారిత్రక కట్టడాల్లో ఒకటిగా చార్మినార్ నిలిచింది. 400 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కట్టడం పర్యాటకులను ఎంతో ఆకర్శిస్తున్నది. ఎన్నో విశేషాలతో ప్రపంచ ఖ్యాతి పొందింది. కుతుబ్షాహీ వంశానికి చెందిన ఐదో పాలకుడు మహ్మద్ కులీ కుతుబ్షా తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కు తరలించిన అనంతరం 1591లో చార్మినార్ నిర్మించారు. మరుసటి ఏడాది చార్మినార్కు నాలుగు వైపులా కమాన్లు 60అడుగుల ఎత్తు, 30అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో పూర్తిచేశారు. ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి 149మెట్లు ఉన్నాయి. 1889లో నాలుగు దిశల్లో గడియారాలను ఏర్పాటు చేశారు.
గోలొండ ప్రాంతాన్ని 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. ఆ తర్వాత ముసునూరి నాయకులు, అనంతరం బహమనీ సుల్తానుల రాజధానిగా, అనంతరం కుతుబ్ షాహీల రాజధానిగా మారి ఎందరో రాజులకు రక్షణ వలయంగా మారింది. కుతుబ్ షాహీ వంశస్తులు గోలొండ కోటను 60 ఏండ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎతె్తైన నల్లరాయి కొండపై శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. బురుజులతో కలిపి సుమారు 5కిలోమీటర్ల చుట్టుకొలత ఉంది. నవాబుల కాలంలో వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు వజ్రం ఈ రాజ్యం పరిధిలోనిదేనని చరిత్రకారులు చెబుతుంటారు. కోట నిర్మించి 500 ఏండ్లు గడిచినా.. ఇన్నేండ్లలో ఎన్ని విపత్తులు వచ్చినా, శత్రువులు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణం సమయంలోనే 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారు. 8 ప్రధాన సింహ ద్వారాలు, 4 వంతెనలు, అనేక రాజ మందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికీ గంగాజెమునా తెహజీబ్కు నిలయంగా వర్ధిల్లుతున్నది.
భువనగిరి దుర్గం 3వేల ఏండ్లకు ముందే నిర్మించారని, తెలంగాణను ఏలిన అందరి పాలనలో భువనగిరి ప్రాంతం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే భువనగిరి కోటకు ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు ఉన్నట్లు పురాతత్వ పరిశోధకులు చెబుతున్నారు. ఇకడ మధ్యపాతరాతియుగం నాటి బొరిగెలు, బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధులు బయటపడ్డాయి. మధ్యరాతియుగం నాటి మానవ నివాస జాడలు, నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలను కనుగొన్నారు. భువనగిరి కోట కుతుబ్షాహీల పరిపాలనలో చాలా కాలం ఉంది. తెలంగాణలో సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ ఇప్పటికీ కనుగొనబడని అనేక గుహలు, సొరంగాలు ఉన్నట్లు చెప్పుకుంటారు. హైదరాబాద్కు 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడం భువనగిరి కోట. 610మీటర్ల ఎతె్తైన ఈ కొండ తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరుల కంటే ఎతె్తైనది. అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. ఇలా అనేక చారిత్ర కట్టడాలు సరైన గుర్తింపునకు నోచుకోలేకపోతున్నాయి.
ఇక్షాకుల కాలం నాటి శిల్పకళకు ఫణిగిరి పెట్టింది పేరు. నల్లగొండ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బౌద్ధ ప్రదేశంలో పూర్వపు ఏపీ పురావస్తు, మ్యూజియాల శాఖ అధికారులు తవ్వకాలు జరిపారు. ఫణిగిరిలో పెద్ద స్థూపం ఉన్న ఓ పెద్ద సముదాయం, స్థూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలున్నాయి. నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధునివిగా తేల్చారు. బౌద్ధ సన్యాసులకు చెందిన 3 విహారాలున్నాయి. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం కొండపై ఉన్నది. దీని ఆకారం పాము పడగను పోలి ఉంది. హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉంటుంది. ఫణిగిరికి 2వేల ఏండ్ల ఘనచరిత్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ సముదాయంలోనే నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పాదముద్రలు బుద్ధునివిగా చెబుతున్నారు. 2001 నుంచి 2007 వరకు ఆరేండ్ల పాటు జరిగిన తవ్వకాల్లో మహాస్థూపం, చైత్య గృహాలు, ఉద్దేశిక స్థూపాలు, బుద్ధుని ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతముని జీవిత ఘట్టాలు, అపురూప శిల్పాలు, శాతవాహనుల క్షేత్రాలు, ఇక్ష్వాకుల, మహావీరుల నాణేలు, మట్టి, సున్నపు బొమ్మలు, పూసలు లభించాయి.
కుతుబ్షాహీ సమాధులు హైదరాబాద్లోని ప్రసిద్ధమైన గోలొండకోట సమీపంలో ఇబ్రహీం బాగ్ (ప్రిసింక్ట్ గార్డెన్) వద్ద కుతుబ్షాహీ వంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులు ఉన్నాయి. ఈ సమాధులను విశాలమైన ఎతె్తైన వేదిక మీద నిర్మించారు. వీటి నిర్మాణ శైలిలో పర్షియన్, పాష్టన్, హిందూ సంప్రదాయాల మిశ్రమం కనిపిస్తుంది. సమాధుల చుట్టూ అందమైన పూదోటలు అలంకరించినట్లు పలకరిస్తుంటాయి. రాజకుటుంబానికి చెందిన ఇతర కుటుంబ సభ్యుల సమాధులు, సుల్తాన్ సమాధుల భేదాలను గుర్తించడానికి సుల్తాన్ సమాధి మీద విభిన్నమైన బంగారు చట్రాలు బిగించారు. 19వ శతాబ్దంలో మూడో సాలార్జంగ్ సమాధులను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వాటి చుట్టూ పూదోట, ప్రహరీ నిర్మించారు.
“పర్యాటక శాఖ, ఆగాఖాన్ ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలో కుతుబ్షాహీ సెవెన్ టూంబ్స్లోని మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నాం. టూంబ్స్లో వంద వరకు స్మారక చిహ్నాలున్నాయి. వాటి పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. నగరానికి తలమానికమైన చార్మినార్, సర్దార్మహల్, మీరాలం మండి, సెంట్రల్ లైబ్రరీ, మొజాంజాహీ మార్కెట్ వంటి వారసత్వ కట్టడాలను పునరుద్ధరిస్తున్నాం. శతాబ్దాల నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ఈ కట్టడాలను మరింత రమణీయంగా తీర్చిదిద్దుతాం”. 2022 సెప్టెంబర్ 15న, సెవెన్ టూంబ్స్ మెట్ల బావుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్