సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లేవారు.. అక్కడ ఏమైనా అనుమానాస్పద పరికరాలు ఉంటే నిశితంగా పరిశీలించాలంటున్నారు సైబర్క్రైమ్ పోలీసులు. పిన్నంబర్లు తరచూ మారుస్తుండాలని చెబుతున్నారు. డెబిట్ కార్డు క్లోనింగ్ ముఠాలు మళ్లీ నగరంలో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ముషీరాబాద్ ఎస్బీఐ బ్యాంకు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్కు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమయ్యారు.
గతంలో తరచూ క్లోనింగ్ ముఠాలు నగరంలో తిరుగుతుండేవి. పలు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు నేరస్తులపై ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు, రోమెనియా దేశం నుంచి వచ్చిన గ్యాంగ్ల ఆట కట్టించారు. బ్యాంకు వినియోగదారులు కూడా అప్రమత్తం కావడంతో పాటు, బ్యాంకులు కూడా తమ ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ సిస్టంను పెంచుకున్నాయి. ఈ క్రమంలో ఏడాదిగా కార్డులు క్లోనింగ్ జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
పంథా మార్చి..
క్లోనింగ్ ముఠాలు ఈ మధ్య కాలంలో నగరంలోకి రాలేదని భావిస్తున్నామని, అయితే ఈ గ్యాంగ్లు తమ నేర స్వభావాన్ని మార్చుకొని, కొత్త విధానంలో సైబర్నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నదని సైబర్క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఇటీవల ముషీరాబాద్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమయ్యామని, లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రహస్య కెమెరాలు అమర్చి..
క్లోనింగ్ ముఠాలు ఏటీఎంలలో కొన్ని పరికరాలు అమర్చి ఖాతాదారుల డెబిట్ కార్డు వివరాలను సేకరిస్తాయి. పిన్ నంబర్ను రికార్డు చేసేందుకు రహస్య కెమెరాలను యంత్రాల్లో అమరుస్తాయి. ఇలా సేకరించిన డేటాతో కొత్తగా క్లోనింగ్ కార్డులు తయారు చేస్తారు. వాటితో ఇతర ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేస్తుంటారు. సైబర్క్రైమ్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ క్లోనింగ్ గ్యాంగ్ సభ్యులపై నిఘా పెట్టి పట్టుకున్నారు.
డేటా సేకరించి..
డేటాను సేకరించి వాటితో కొత్తగా కార్డులను తయారు చేసి.. డబ్బులు డ్రా చేసేందుకు కొంత విరామం తీసుకుంటారు నిందితులు. అయితే ఆ మధ్య కాలంలో తమ ఏటీఎం పిన్ కార్డులు మార్చేసుకున్న వారి ఖాతాలు సేఫ్గా ఉన్నాయి. ఏటీఎం కార్డులో డబ్బు డ్రా చేసినప్పుడు రికార్డు అయిన పిన్, క్లోనింగ్ కార్డులతో నిందితులు డబ్బులు డ్రా చేసే సమయానికి అదే పాస్వర్డ్ ఉంటే మాత్రం అకౌంట్ ఖాళీ అవుతాయి.
గమనించాలి…
ఏటీఎం కేంద్రాల్లో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లే సమయంలో కార్డు స్వైప్ చేసే చోటు ఏదైనా అనుమానాస్పద పరికరాలుంటే క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. యంత్రంలో పిన్ కొట్టే స్థానంలో పైన, పక్కన నంబర్లు రికార్డు చేసేందుకు కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశాలుంటాయి. దీనిని కూడా గమనించాలంటున్నారు. అనుమానం వస్తే పిన్నంబర్లు మార్చుకోవాలని, తరచూగా మార్చుకోవడం ఇంకా ఉత్తమమని చెబుతున్నారు.