సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు తాగడం ఎండాకాలంలో సర్వసాధారణం. జ్యూస్లు కాకపోయినా కనీసం చల్లటి నీరైనా తాగనిదే ఉండలేం. ప్రస్తుతం గ్రేటర్లో ఉష్ణోగత్రలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో నగరంలో ఎండ వేడి పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో దాహం వేయడం సహజం. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు చాలా మంది రోడ్లపై విక్రయించే పలు రకాల జ్యూస్లు, నిమ్మరసం, సోడ వంటి చల్లటి పానీయాలు తాగుతుంటారు. మరికొంత మంది కొబ్బరి బోండాలు, చెరుకు రసం వంటివి తీసుకుంటారు. అయితే కొబ్బరి బోండాలు మినహా ఇతర జ్యూస్లు, చల్లటి పానియాలు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యనిపుణులు.
ముఖ్యంగా చాలా మంది వీధి వ్యాపారులు, జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు సరైన పరిశుభ్రత పాటించకుండా పండ్ల రసాలు, లస్సీ, నిమ్మరసం, సోడా తదితర పానీయాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. వాటిల్లో వినియోగించే రసాయన పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చల్లదనం కోసం పానియాల్లో వేసే ఐస్ ముక్కలు కలుషితమైనవి కావడంతో తాగిన పానీయాలు అనారోగ్యాన్ని కలిగించే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఒక పక్క ఎండల తీవ్రతతో శరీరం నిర్జలీకరణకు గురవుతుండగా, మరో పక్క కలుషిత పానియాలు తీసుకోవడం వల్ల డయేరియాకు గురై, తీవ్ర అనారోగ్యం బారినపడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించండి:
వెంటనే నీరు తాగవద్దు
ఎండలో తిరిగి వచ్చిన వెంటనే నీరు, ఇతర చల్లటి పదార్థాలేవి కూడా తీసుకోవద్దు. వేసవిలో బయట తిరిగి వచ్చిన వెంటనే కొద్దిసేపు నీడలో కూర్చోవాలి. దీని వల్ల శరీరం చల్లబడటంతోపాటు శరీరంలోని అవయవాలు కూడా చల్లబడుతాయి. ఎండలో తిరిగిన వారు కనీసం 5నుంచి 10నిమిషాలు నీడలో సేద తీరిన తరువాత స్వచ్ఛమైన నీరు తాగాలి. వేసవిలో బయటకు వెళ్లినప్పుడు వెంట తాగునీటి బాటల్ తీసుకెళ్లడం ఉత్తమం. వీధులపై విక్రయించే చల్లటి పానియాలు, జ్యూస్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఒక్కసారిగా చల్లటి నీరు తాగడం గాని, కూల్డ్రింక్స్, జ్యూస్లు, ఇతర చల్లటి పదార్థాలను తీసుకున్నా గొంతు నొప్పి వస్తుంది.
– డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన