మేడ్చల్, డిసెంబర్ 28: నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను తెలంగాణ ప్రభుత్వం తిరగరాసింది. నేను పోతా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య, వైద్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. నాణ్యమైన విద్య, వైద్యం అందజేసేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిచింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం పొందే వారి సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నది. సమగ్ర రక్షణ వ్యవస్థతో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. మాతా శిశు మరణాలు తగ్గాయి.
మేడ్చల్ నియోజకవర్గంలో 8 ప్రభుత్వ దవాఖానలు ఉన్నాయి. అందులో ఘట్కేసర్, మేడ్చల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లు ఉండగా, జవహర్నగర్, కీసర, నారపల్లి, పర్వాతాపూర్, శామీర్పేట, శ్రీరంగవరంలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ 8 కేంద్రాల్లో పరిధిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 9 నెలల్లో రిజిస్టర్ అయిన వారిలో 1421 గర్భిణులు ప్రభు త్వ దవాఖానలను ఆశ్రయించగా 946 మంది సాధారణంగా ప్రసవించారు. కేవలం 475 మందికి మాత్రమే సిజేరియన్ జరిగింది.
గర్భం దాల్చిన మొదటి నెలలో సంబంధిత ప్రభుత్వ దవాఖానల్లో రిజిస్టర్ చేసుకుంటే బిడ్డ పుట్టే వరకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, ఎత్తు, బరువు తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తం అవసరమైతే వైద్య సిబ్బందే అంబులెన్స్లో పై దవాఖానాలకు తీసుకెళ్లి, అందేలా చర్యలు తీసుకుంటున్నారు. తల్లీ, బిడ్డా ఆరోగ్యానికి అవసరమైన మందులను ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహార అందజేస్తున్నారు. 6 నెలల నుంచి ప్రసవించే వరకు మండల వైద్యాధికారి పర్యవేక్షిస్తున్నారు. అన్ని రకాల చర్యలతో మహిళలు సాధారణ ప్రసవిస్తున్నారు. ఉచితంగా నాణ్యమైన వైద్యం అందజేస్తూ కేసీఆర్ కిట్, నగదు ఇస్తుండటంతో ఎక్కువ మంది మహిళలు పీహెచ్సీలను ఆశ్రయిస్తున్నారు.
నియోజకవర్గంలో జవహర్నగర్, కీసర, నారపల్లి, పర్వాతపూర్, శామీర్పేట, శ్రీరంగవరం ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరిగాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 9 నెలల కాలంలో జవహర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 88 మంది, కీసరలో 93 మంది, నారపల్లిలో 87 మంది, పర్వతాపూర్లో 98 మంది, శామీర్పేటలో 79 మంది, శ్రీరంగవరంలో 51 మంది మహిళలు సాధారణంగా ప్రసవించారు. కేవలం మేడ్చల్ సీహెచ్సీలో 42 మందికి, ఘట్కేసర్లో సీహెచ్సీలో 433 మందికి సెక్షన్ జరిగింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గాయి. గవర్నమెంట్ హాస్పటల్స్లో డాక్టర్ల సంఖ్యలో పెరిగింది. ఎంసీహెచ్(మాత శిశు దవాఖాన)లు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంటే కూడా డాక్టర్లు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటున్నారు. వైద్యులు, సిబ్బంది బాధ్యత పెరగడం, కేసీఆర్ కిట్ లాంటి పథకాలతో ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు. పీహెచ్సీలో వందశాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. హరీశ్రావు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెక్షన్ల రేటు మరింత తగ్గింది. ఆయన నేరుగా పీహెచ్సీ డాక్టర్లతో మాట్లాడుతుండటంతో వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగు పడింది.
-కోణం శ్రీకాంత్, వైద్యాధికారి, శామీర్పేట