సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): నగర వైద్య, ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మహానగరాన్ని.. ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు వైద్యుల రెగ్యులర్ నియామకం చేపడుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 50మంది వైద్యులను వైద్య, ఆరోగ్యశాఖ నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వైద్యుల నియామకాల్లో గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిక్రూట్ అయిన 50మంది వైద్యులు సంబంధిత జిల్లాల్లో రిపోర్ట్ చేసినట్లు జిల్లాల వైద్యాధికారులు వెల్లడించారు.
మరింత మెరుగైన వైద్యసేవలు
పెద్ద ఎత్తున జరిగిన వైద్యుల నియామకంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ వైద్యుల నియామకం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ప్రజలకు పూర్తిస్థాయి నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరోగ్య పథకాలు సైతం ప్రజలకు పూర్తిస్థాయిలో అందనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయి భరోసా లభించనున్నది.
కంటి వెలుగుకు మరో 115మంది వైద్యులు
ఈనెల 18న ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమం కోసం అదనంగా మరో 115మంది కంటి వైద్యులను తాత్కాలిక పద్ధతిన నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 124మంది పారా ఆప్తాల్మిక్ ఆఫీసర్లు, 124 డీటీపీ ఆపరేటర్లను నియమించారు. దీంతో కంటి వెలుగు ద్వారా రోగులకు అత్యంత మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇది శుభపరిణామం..
సుదీర్ఘకాలం తరువాత తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఇంత పెద్ద ఎత్తున వైద్యుల నియామకం జరిగింది. ఇది శుభపరిణామం. ఈ రిక్రూట్మెంట్ వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో బయటకు వస్తున్న వైద్య విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించడం. రెండవది ప్రజలకు మరింత మెరుగైన, నమ్మకమైన వైద్యం అందడం. ఇది చాలా ముఖ్యమైనది. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఎన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ తగినంత మంది వైద్యులు లేకపోతే ఆశించిన ఫలితాలు ఉండవు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వైద్య, ఆరోగ్యశాఖను పూర్తిస్థాయి బలోపేతం చేయడం సంతోషకరం.
– డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
ప్రతి పీహెచ్సీ బలోపేతమవుతుంది
గతంలో సరిపోను వైద్యులు లేక పలు ఇబ్బందులు తలెత్తేవి. మేడ్చల్ జిల్లాలో 12పీహెచ్సీలు, 24యూపీహెచ్సీలు ఉన్నాయి. గతంలో మా జిల్లాలో 16మంది రెగ్యులర్ వైద్యులు ఉండగా వారిలో ఆరుగురు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో వైద్యుల సంఖ్య 10కి తగ్గింది. ఇటీవల 6మంది వైద్యులు రిక్రూట్ కావడంతో ఆ ఖాళీలు భర్తీ అయ్యాయి. ఫలితంగా ప్రతి పీహెచ్సీ పూర్తిస్థాయిలో బలోపేతమవుతుంది. సరిపడా వైద్యులు ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యపథకాలను సైతం సక్రమంగా అమలు చేయగలుగుతాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి