సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయామం, నడక ఆరోగ్యాన్ని కాపాడుతుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్హెచ్ఎఫ్) సహకారంతో నగర పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న 16 వేల మంది సిబ్బందికి హెల్త్ స్క్రీనింగ్ చేసి ఫిట్కాప్ యాప్ సహకారంతో మెరుగైన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వివరిస్తున్నది. ఈ క్రమంలోనే హైరిస్క్ ఉన్న 60 మంది సిబ్బంది తమ ఆరోగ్యాన్ని ఫిట్ కాప్ యాప్ ద్వారా మెరుగుపరుచుకున్నారు. వీరికి పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు.
చార్మినార్ పీఎస్లో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసే పరిస్థితి ఉండేది. ఫిట్కాప్ యాప్ ద్వారా తన ఆరోగ్యాన్ని ఆయన మెరుగుపరుచుకొని తిరిగి ఉద్యోగంలో ఉత్సాహంగా పని చేసే స్థాయికి వచ్చాడు. ఒక మహిళా కానిస్టేబుల్ తన కూతురు ప్రాణాలను కాపాడుకుంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్తో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం కోసం ఫిట్కాప్ యాప్ ద్వారా కౌన్సిలర్లు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం, బరువు తగ్గించడం కోసం చేసే వ్యాయామాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తమ కుటుంబంలో ఆరోగ్య సంస్కృతిని ప్రతిబింబించాలని సీపీ సిబ్బందికి సూచనలు చేశారు. మెరుగైన ఆరోగ్య పరిస్థితికి శరీరంలోని కేలరీలను కరిగించాలని అవసరమైనప్పుడు నడవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆరు నెలల్లో సిబ్బంది ఆరోగ్య అలవాటు మార్చడం, వారి ఆరోగ్యం విషయంలో పురోగతి ఉండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిస్క్ కేటగిరీలో ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న అభ్యర్థులను టీ షర్టులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ గజరావు భూపాల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్చార్జి, డీసీపీ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.