మేడ్చల్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): 59 జీవో కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు ఈ నెల చివరి వారం వరకు డబ్బులు చెల్లించేలా రెవెన్యూ అధికారులు గడువు ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 59 జీవో క్రమబద్ధీకరణ(రెగ్యులరైజ్)చేసేందుకు 7,892 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, అల్వాల్, దుండిగల్, బాచుపల్లి, మేడిపల్లి, కీసర, ఘట్కేసర్, మూడుచింతలపల్లి, మీర్పేట్ మండలాల్లో ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రస్తుత మార్కెట్ ధరను అనుసరించి అర్హత సాధించిన లబ్ధిదారులకు డిమాండ్ నోటీసులను జారీ చేసి క్రమబద్ధీకరణకు డీడీల ద్వారా డబ్బులు చెల్లించాలని నోటీసులలో పేర్కొన్నారు.
59 జీవోలో 2014 జూన్ 2 నాటికి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు మాత్రమే క్రమబద్ధీకరణ(రెగ్యులరైజ్) చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం విధితమే. 250 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకుంటే అ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25 శాతం, 251 నుంచి 500 వందల వరకు 50 శాతం, 500 వందల నుంచి గజాలలోపు ఇళ్లు నిర్మించుకుంటే 75 శాతం చెల్లించే విధంగా వచ్చిన దరఖాస్తుల అధారంగా డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా వచ్చిన 59 జీవోలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్డీవో, తహసీల్దార్లు ప్రత్యేకంగా దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిమాండ్ నోటీసులను జారీ చేశారు. లబ్ధిదారులు నోటీసుల ఆదారంగా డీడీల ద్వారా డబ్బులు చెల్లించినట్లయితే ఇళ్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.