మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 561 మంది లబ్ధిదారులు
జిల్లా కలెక్టరేట్లో మంత్రి, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ
మేడ్చల్, ఏప్రిల్ 4: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ లబ్ధిదారులైన 561 మందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాల (యూనిట్ల)కు సంబంధించి మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద, మాదవరం కృష్ణారావు, బేతి సుభాష్రెడ్డిలు మంజూరు పత్రాలు అందజేస్తారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులందరకి నేటి నుంచి వారం రోజులలో మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ వెల్లడించారు. వ్యాపారాలు ప్రారంభమైన ఆరు నెలల పాటు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.