మలక్పేట, జనవరి 27 : వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) ఏసీపీ జి.శంకర్రాజు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం దిల్సుఖ్నగర్లోని గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఐడియల్ డిగ్రీ మహిళా కళాశాలలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988, 2019లపై విద్యార్థినులకు అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసే ముందు మీపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. నియమాలను ఉల్లంఘిస్తూ ప్రతియేటా లక్షలాదిమంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతూ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారని తెలిపారు. వేగంకన్నా.. ప్రాణం మిన్నా అని.. స్పీడ్ థ్రిల్ నిస్తుందని, కాని కిల్ చేస్తుందన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం18 నుంచి 40 ఏండ్ల లోపువారే ఉంటున్నారని తెలిపారు. మైనర్ డ్రైవింగ్, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయటం, మద్యం సేవించి వాహనాలు నడుపటం ప్రమాదకరమని, రవాణా చట్టం ప్రకారం నేరమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాఠశాల స్థాయి నుంచే ఒక పాఠ్యాంశంగా బోధించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండదన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేనివారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలబారిన పడుతున్నట్లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల సీసీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తుందన్నారు.
ఇటీవల కాలంలో మైనర్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువైనాయని, సెల్ఫోన్లలో సంభాషిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం, చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను చూపించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐడియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.మధుసూదన్, ఏఓ రాజశేఖర్రెడ్డి, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అబ్దుల్ మాజిద్ఖాన్, చిరంజీవి, కానిస్టేబుళ్లు రామన్ రాజు, సందీప్ పాల్గొన్నారు.