Hyderabad | మలక్పేట, ఆగస్టు 20: స్వచ్ఛంద సంస్థ ముసుగులో యాచిస్తూ, సామాన్య ప్రజలను మోసగిస్తూ అక్రమ ఆస్తులను కూడబెడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠాను మలక్పేట పోలీసుల సహకారంతో సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. పదిమంది నిందితులను అరెస్ ్టచేసిన పోలీసులు వారి వద్దనుంచి రూ.1,38,262 నగదు, రెండు ఆటోలు, ఐదు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మూడు సెల్ఫోన్లు, 12 కలెక్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్- ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్. రూపేశ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన కెతావత్ రవి(35) మీర్పేట నంది హిల్స్లో, అతడి సోదరుడు కెతావత్ మంగు(30) ఆర్ఎన్ రెడ్డి నగర్లో నివాసముంటూ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో స్వచ్ఛంద సంస్థ ముసుగులో భిక్షాటన చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారు.
స్వచ్ఛంద సంస్థ పేరుతో..
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వెనుకాల దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ‘అమ్మ చేయూత ఫౌండేషన్’ వ్యవస్థాపక నిర్వాహకుడు గడ్డి గణేశ్ (43)ను 2020లో కలిశారు. సంస్థ పేరుతో భిక్షాటన చేసి, డబ్బులు సంపాదించే పథకాన్ని వివరించారు. ఒక కలెక్షన్ బాక్స్కు రెండువేలు చొప్పున ఇస్తామంటూ గణేశ్తో ఒప్పందం చేసుకున్నారు. సంస్థ పేరుతో ఐడీ, విజిటింగ్ కార్డులు, బాక్సులు. వైట్ కోట్లను తయారు చేయించారు. వారికి తెలిసిన నిరుద్యోగ యువతులు, మహిళలతో మాట్లాడి భిక్షాటన చేయిస్తున్నారు. వచ్చిన డబ్బులో వారికి సగం ఇస్తామని ఒప్పందం చేసుకొని.. ఆ ప్రకారమే వారికి ఐడీ, విజిటింగ్ కార్డులు, బాక్సులు, వైట్ కోట్లను ఇచ్చి, సాయంత్రం వేళల్లో జంట నగరాల్లోని రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద దింపుతున్నారు. వారి బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన ఒక క్యూఆర్ కోడ్ను సృష్టించి డబ్బాలకు అతికించారు.
వచ్చినదాంట్లో సగం.. సగం..
ఆయా జంక్షన్ల వద్ద ఉంటున్న వారి వద్దకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెళ్లి వారిని పికప్ చేసుకుంటారు. యాచించగా వచ్చిన డబ్బును లెక్కించి 50-50 వాటాగా పంచుకుంటున్నారు. వీరి వాటాగా వచ్చిన ఆధాయంతో గణేశ్, కేతావత్ రవి, కెతావత్ మంగులు నాదర్గుల్, బడంగ్పేట్, తుర్కాయాంజాల్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఫౌండేషన్ పేరుతో డబ్బుల కోసం బెగ్గింగ్ మాఫియాను దింపి సామాన్య ప్రజలను మోసగిస్తూ అక్రమ ఆస్తులు కూడబెడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ బృందం, మలక్పేట పోలీసుల సహాయంతో ఆదివారం మూసారాంబాగ్ చౌరస్తా వద్ద వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చిట్టా అంతా బయటపెట్టారు. దీంతో, నిందితులైన కెతావత్ రవి, కెతావత్ మంగు, గడ్డి గణేశ్తోపాటు బెగ్గర్లు రమావత్ అనూష(18), బానవత్ సంగీత(28), నేనావత్ శైలజ(26), రమావత్ ఎల్లమ్మ(20), కెతావత్ చిల్కీ(25), సభావత్ సునీత (26), కెతావత్ సరోజ(25)లను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,38,262 నగదు, రెండు ఆటోలు, ఐదు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంట్లు, మూడు సెల్ఫోన్లు, 12 కలెక్షన్ బాక్సులు, ఐడీ, విజిటింగ్ కార్డులు, కాయిన్స్ (రూ.2788), 7 వైట్ కోట్లను, నగదు లెక్కింపులకు సంబంధించిన బుక్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
బెగ్గింగ్ సొమ్ముతో ప్లాట్ల కొనుగోలు.
ఈ బెగ్గింగ్ మాఫియా ముఠా యాచించగా వచ్చిన ఆధాయంతో నాదర్గుల్, బడంగ్పేట, తుర్కాయాంజాల్ ప్రాంతాల్లో రూ.80 లక్షలతో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసిందని డీసీపీ రూపేశ్ తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఏవీఆర్ నర్సింహారావు, మలక్పేట ఏసీపీ జి.శ్యాంసుందర్, సౌత్ -ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ మలక్పేట డివిజన్ ఇన్స్పెక్టర్ చిట్టి బుర్ర, మలక్పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్, డీఐ జయరాం, అడ్మిన్ ఎస్ఐ కిరణ్లాల్, టాస్క్ఫోర్స్ సిబ్బంది సి.రాఘవేంద్రారెడ్డి, ఎం.అనంత చారి, పి.సాయిరాం, మలక్పేట సిబ్బంది పాల్గొన్నారు.