సైదాబాద్, ఫిబ్రవరి 21 : తల్లిదండ్రులకు ఇద్దరికీ మద్యం తాగించి ఐదేండ్ల బాలుడిని బిక్షాటన చేసే వ్యక్తి ఎత్తుకెళ్లిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అడ్మిన్ ఎస్సై శివకుమారి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన పార్ధ జంగయ్య, లక్ష్మి దంపతులకు ఐదేండ్ల కుమారుడు రామ్చరణ్ ఉన్నాడు. సంతోష్నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటూ బిక్షాటన చేసుకుని జీవిస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా శనివారం సైదాబాద్ శంకేశ్వరబజార్లోని శంకేశ్వరాలయం వద్దకు బిక్షాటన కోసం వచ్చారు.
ఆలయం వద్ద బిక్షాటన చేసుకునే క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన పాండుతో పరిచయం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం బిక్షాటన పూర్తి అయిన తర్వాత పాండు మద్యం కొనిపిస్తానని లక్ష్మి, జంగయ్యలకు చెప్పడంతో వారు బాలుడితో పాటు చంపాపేట వైన్స్ వద్దకు వెళ్లారు. లక్ష్మి, జంగయ్య మద్యం మత్తులో ఉండగా పాండు బాలుడిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్న బాలుడి తల్లిదండ్రులు బాలుడు కనిపించక పోవడంతో సోమవారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైన్స్షాపు వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా పాండు బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. పాండు సొంత ఊరికి వెళ్లిన పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.