మెహిదీపట్నం, జనవరి 18 : పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తం గా విధులు నిర్వహించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీస్స్టేషన్లలో సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఆసిఫ్నగర్ పోలీస్ డివిజన్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లలో అధికారులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. లంగర్హౌస్, గోల్కొండ, ఆసిఫ్నగర్, హుమాయూన్నగర్, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు ఎస్సైలు, ఏఎస్సైలు , హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది కలిపి మొత్తం 15 మంది వరకు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్లకు వచ్చే వారిని పూర్తి కరోనా నిబంధనలతో అనుమతిస్తున్నారు. పోలీస్ స్టేషన్ భవనం మొత్తం శానిటైజేషన్ చేయించడం, సిబ్బందికి అనారోగ్య సూచనలు ఉంటే జాగ్రత్తలు చెప్పి పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించడం, పోలీస్ స్టేషన్లోకి వచ్చే వారికి ఉష్ణోగ్రతను పరీక్షించడం, లోపలికి మాస్క్ ధరించిన వారినే అనుమతించడం లాంటి జాగ్రత్తలను ఆయా స్టేషన్ల అధికారులు చేపట్టారు.
నానల్నగర్లో వ్యాక్సినేషన్
నానల్నగర్ హకీంపేట్ బస్తీలో మంగళవారం జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమాన్ని నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటించాలన్నారు.
విజయ్నగర్ కాలనీలో నాంపల్లి ఎమ్మెల్యే పర్యటన
ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం విజయ్నగర్ కాలనీ డివిజన్ హుమాయూన్నగర్, కైలాష్ నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి డాక్టర్ షేక్ ఖాసీంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
కొవిడ్ బారిన పడకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని ఆసిఫ్నగర్ డివిజన్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి అన్నారు. పోలీస్స్టేషన్లలో తీసుకుంటున్న జాగ్రత్తల వివరాలు అడుగగా.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచిస్తున్నామని ఏసీపీ అన్నారు. అంతే కాకుండా నాణ్యమైన మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని చెపుతున్నామని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండి ప్రజల శాంతిభద్రతలను కాపాడాలని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.