ఉస్మానియా యూనివర్సిటీ : ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకాభిప్రాయంతో రాష్ట్రపతికి పంపించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో కోర్టు వివాదాలకు అవకాశం లేకుండా, న్యాయ సమీక్షకు దూరంగా ఉండేందుకు తొమ్మిదవ షెడ్యూళ్లో చేర్చాలని కోరారు. ఈ డిమాండ్లతో బీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలనే బీజేపీ వైఖరిని తప్పుపట్టారు. 1971లో అనంతరామన్ కమిషన్ ఆధ్వర్యంలో ఆరు ముస్లిం ఉపకులాలను చేర్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే ఆ పార్టీని బీసీల ద్రోహిగా ప్రకటిస్తామన్నారు. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత దాదాపు మూడు నెలలు ఢిల్లీలో మకాం వేసి, రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూళ్లో చేర్పించారని గుర్తు చేశారు.
దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లలో బీసీ మహిళా కోటా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వీరబోయిన లింగంయాదవ్, బారీ అశోక్ కుమార్, కడారి రమేశ్, వెంపటి సురేష్, వడ్డే గణేష్, జక్కిలి అనిల్, పైడి, వేముల సురేష్, వెంబటి అభిలాష్, శంకర్యాదవ్, మేడబోయిన గణేష్, భయ్యా రాజేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.