హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైటెక్స్లోని న్యాక్లో ఏర్పాటుచేసిన 200 పడకల కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఐదు ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్న ఈ కేంద్రాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ (ఐఏహెచ్వీ), రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువ వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే తాత్కాలిక వైద్య సిబ్బందిగా నియమించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని పేదలకు (తెల్ల రేషన్ కార్డుదారులకు) రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం అందించనున్నామన్నారు. న్యాక్లో ఐసొలేషన్ సెంటర్ను వినియోగించుకోవాలనుకునేవారు సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617440 కు కాల్ చేసి ఉచితంగా బెడ్ను పొందవచ్చన్నారు. కొవిడ్ బాధితుల కోసం సీపీ కార్యాలయంలో 16 అంబులెన్స్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.