ముషీరాబాద్, ఆగస్టు 24 : జనగణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనగణనలో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి బీసీలను విస్మరించిందని ఆరోపించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద బీసీల కులగణన జరిగితేనే..బీసీలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపడుతామన్న కేంద్రం బీసీలకు ప్రత్యేక కాలం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీసీనని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ 80 ఏండ్లుగా బీసీలు అగ్రవర్ణాల పాలనలో మోసపోతున్నారని, జనగణనలో కులగణన చేపడితేనే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు.
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో జంతువులకు, చెట్లకు లెక్కలు ఉన్నా బీసీలకు మాత్రం లెక్కలు లేకపోవడం దారుణమన్నారు. దీక్షలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సరిత, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక, గుజ్జ కృష్ణ, బాలగోని బాలరాజ్ గౌడ్, దుర్గయ్య గౌడ్, కోల జనార్దన్, శ్యామ్కురమ, శ్రీకాంత్, లక్ష్మణ్ యాదవ్, అజయ్ పాల్గొన్నారు.