పూల పండుగతో భాగ్యనగరం పులకించింది..ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది.. గౌరమ్మను కొలిచి సౌభాగ్యాలివ్వమని వేడుకుంది. పెత్రమాస బతుకమ్మ వేడుకలు బుధవారం నగరవ్యాప్తంగా అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ శ్రావ్యంగా పాడుతూ ఆడు తూ సందడి చేశారు. బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో సంబురాలు హోరెత్తాయి.
బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో గ్రేటర్వ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న నీటికొలనులతోపాటు స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయి.
నగరం పూల వనమైంది! రంగురంగుల పూలు పట్టుపరికిణి కట్టిన అమ్మాయిలా పరిమళాలు వెదజల్లాయి. నిండైన అందచందాలతో మైమరపించాయి. ఆటపాటలతో ఊరేగి చల్లని దీవెనలిచ్చాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన బతుకమ్మ పండుగ గ్రేటర్లో కోలాహలంగా సాగింది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ తొమ్మిది రోజుల పాటు సాగే వేడుకలు భాద్రపద బహుళ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆడే ఈ బతుకమ్మకు తొమ్మిది పేర్లు ఉన్నాయి. అయితే తొలిరోజు ఆడే ఎంగిలిపూల బతుకమ్మకు ఆ పేరు రావడానికి గల కారణాలను పలు పురాణాల్లో పేర్కొన్నారు.
చోళరాజు ధర్మాంగధుడికి నూరు మంది సంతానం. వీరంతా యుద్ధంలో మరణిస్తారు. అయితే చాలా రోజుల తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుడుతుంది. లేకలేక పుట్టిన ఆడపిల్లకు ఆ దంపతులు ‘బతుకమ్మ’గా నామకరణం చేసి నిండు నూరేండ్లు బతకాలని ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే తరతరాలుగా పూజలందుకుంటున్నదని చరిత్ర చెబుతున్నది.
బతుకమ్మను పేర్చేటప్పుడు పూర్వకాలంలో పూల కాడలను నోటితో కొరకడం.. చేతులతో సమానంగా తుంచడంతో ఆ పూలు ఎంగిలిపడ్డట్టుగా భావించేవారు. అందుకే పెత్రమాస నాడు ఆడే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మగా పేరొచ్చినట్లు అనేక పురాణాల్లో ఉంది.తొలిరోజు బతుకమ్మను పేర్చేందుకు ముందురోజే పూలను తీసుకుని రావటం.. ఆ పూలతోనే బతుకమ్మను పేర్చటంతో ఈ ఉత్సవానికి ఎంగిలిపూల బతుకమ్మగా పేరొచ్చిందట. కొన్ని ప్రాంతాల్లో అన్నం తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తుండటంతో ఎంగిలిపూల బతుకమ్మగా పేరు వచ్చినట్టు పూర్వీకులు చెబుతున్నారు.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో….
రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో…
నెత్తిమీద సూర్యడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో…
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలకుమారుడా ఉయ్యాలో…
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరమాసము ఉయ్యాలో…
బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో…
తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో…
పన్నేండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో….
తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో…
నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో…
నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో….
పచ్చ పచ్చయి గుళ్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో…
పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుళ్లు ఉయ్యాలో…
పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో…
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో…
గ్రేటర్ ప్రజలకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి స్వరూపమే బతుకమ్మ అని, బతుకమ్మను పూజిస్తే ప్రకృతిని పూజించినట్లేనని ఆమె అన్నారు. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూజించడం ఈ పండుగ ప్రత్యేకతగా వివరించారు.
రవీంద్రభారతి, అక్టోబర్ 6: కవులు, కళాకారులను ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. బుధవారం తెలంగాణ ప్రభు త్వం, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ రవీంద్రభారతి వేదికగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.