Mango Season | ఎల్బీనగర్, ఫిబ్రవరి 20 : మామిడి సీజన్కు బాటసింగారం పండ్ల మార్కెట్ సిద్ధం అవుతోంది. ఇందుకనుగుణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. మార్చి 1వ తేదీ నాటికి మార్కెట్లోకి పూర్తి స్థాయిలో మామిడి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రతి ఏడాది మామిడి సీజన్ మూడు, నాలుగు నెలల పాటు భారీ ఎత్తున కొనసాగుతుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డులో దిగుమతి, ఎగుమతులు కొన సాగుతాయి. మామిడి సీజన్లో ఉత్తరాది రాష్ర్టాల నుంచి భారీగా వాహనాలు యార్డుకు వస్తాయి.
వ్యవసాయ మార్కెట్ కమిటీ 19.27 ఎకరాల్లో మామిడి సీజన్కు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించారు. ఈ సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలతో 6 షెడ్లను నిర్మించారు. మంచినీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులతో పాటు మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్తో పాటు జనరేటర్ను కూడా అందుబాటులో ఉంచారు.
ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ యార్డుకు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మామిడి వస్తుంది. తోతాపురి రకం కర్ణాటక, ఏపీలోని చిత్తూరు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ర్టాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలకు ఎగుమతి అవుతోంది.
అయితే ప్రస్తుతం సీజన్ ఆరంభానికి సమయం ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు స్వల్ప మోతాదులో మామిడి సరుకు వస్తున్నది. కర్ణాటక నుంచి సుమారు 4 టన్నుల వరకు వస్తుండగా… వేలంలో ఒక టన్నుకు కనిష్ఠంగా ధర రూ.20 వేలు పలుకుతుండగా, గరిష్ఠంగా రూ.40 వేలు పలుకుతుందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు.
మామిడి సీజన్ కోసం బాటసింగారం మార్కెట్ యార్డులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రైతన్నలు, వ్యాపారుల కోసం మంచినీటి వ్యవస్థతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను బాగు చేయిస్తున్నాం. నీటి సదుపాయం కోసం 7 ట్యాంకులను అందుబాటులోకి తెస్తాం. మార్కెట్ కమిటీకి చెందిన ఒక వే బ్రిడ్జ్తో పాటు అదనంగా మరో వే బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తున్నాం. అదనంగా మరో 20 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తాం. అగ్ని ప్రమాదాల నివారణకు ఒక ఫైరింజన్ను యార్డులో అందుబాటులో ఉంచాం. గత సీజన్లో రూ. 2.57 కోట్ల మార్కెట్ ఫీజు వసూలైంది.
– చిలుకా నర్సింహా రెడ్డి , గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి (ఎఫ్ఏసీ)