సికింద్రాబాద్, మార్చి 27: కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలోని 108 బజార్ బస్తీవాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహాయాదవ్ నేతృత్వంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిని కలిశారు. గతంలో బస్తీలోని తమ ఇండ్లకు రాకపోకలు సాగించేందుకుగాను ఉన్న దారిని, గేట్లను మూసివేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మిలటరీ వారికి సంబంధించిన రాకపోకలు సాగించే ప్రతిసారి ఆధార్ కార్డును చూపించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మురుగుదొడ్లు, శిథిలావస్థకు చేరుకున్న ఇండ్ల మరమ్మతులు చేపడదామనుకుంటే మిలటరీ అధికారులు పదేపదే అడ్డుకుంటున్నారని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను మిలటరీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరుతు బస్తీవాసులు రాజశేఖర్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకుగాను ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసన్, గౌరీశంకర్, ఫిలిప్స్, లక్ష్మణ్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.