మారేడ్పల్లి, మార్చి 26 : కంటోన్మెంట్ మూడో వార్డులోని మడ్పోర్ట్ అంబేద్కర్హట్స్ బస్తీలో పలు సమస్యలపై రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మంది జనాభా నివస్తున్నారని, ఇక్కడ 5 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని బస్తీ వాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బస్తీలో అర్హులైన వృద్ధులకు కొత్త పింఛన్లు ఇప్పించాలని స్థానికులు కోరారు. కంటోన్మెంట్లో 35 వేల ఓట్ల తొలగింపు, కంటోన్మెంట్ రోడ్ల మూసివేత పై ఈ సందర్భంగా చర్చించారు.
అనంతరం కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంత ప్రజలకు ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్థానికంగా మరుగుదొడ్ల ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధుల కోసం ప్రయత్నం చేస్తామని, లేని ఎడల సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నూతన పింఛన్లను కూడా అర్హులందరికి త్వరలో అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు అశోక్, వెంకట్, రాములు, కనకసుందర్, గురువయ్య, వెంకట్, సందీస్, అంజి, సాయికృష్ణ, రోషన్న, రఘు, మోని, త్రివేద్, ఫహీం, సాయి కిరణ్ పాల్గొన్నారు.