నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వారికి పైసా ఖర్చు లేకుండా వైద్యమందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సాధారణ వైద్యంతోపాటు కరోనా సేవలందిస్తూ ఆర్థిక ఊరట కలిగిస్తున్నాయి. సాధారణ జ్వరం, జలుబు, దగ్గుతోపాటు సూపర్ స్పెషాలిటీ సేవలు కల్పిస్తూ బస్తీవాసుల మన్ననలు పొందుతున్నాయి. ప్రతి బస్తీ దవాఖానలో నిత్యం 80 నుంచి 90 మందికి అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుతుండగా, అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాదు వేలాది రూపాయలు విలువచేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. మహమ్మారి కరోనా పంజా విసురుతుండడంతో పలు బస్తీ దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాల్లో కరోనా నియంత్రణ టీకాలు వేస్తూ మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. వైద్య నిపుణులతో నేరుగా మాట్లాడేందుకు ఈ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలను కూడా ప్రారంభించారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే టీకాలను ప్రతి బుధ, శనివారాల్లో వేస్తుండడం విశేషం.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బస్తీ దవాఖానాలు అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలతోపాటు కరోనా సేవలందిస్తున్నాయి. పేదలకు చక్కటి వైద్యమందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిత్యం ఓపీ సేవలతోపాటు కరోనా కేసులు అధికంగా వస్తుండడంతో పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిన వారిని సమీపంలోని కొవిడ్ వైద్యశాలలకు తరలిస్తున్నారు. హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ చేయడంతోపాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలు ఒకేలా ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురికాకుండా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
డాక్టర్లు ఉంటే మందులు ఉండవు..మందులు ఉంటే డాక్టర్లు ఉండరు…చిన్న రోగానికి పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి సమస్య. దీన్ని పోగొట్టి పేదలకు చక్కటి వైద్యమందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 226 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో స్పెషలిస్టుల వైద్యంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. రక్త పరీక్షలు, జనరల్ ఓపీ, బీపీ, షుగర్ చెక్ప్తోపాటు ప్రతి బుధవారం పిల్లలకు సాధారణ టీకాలు వేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలోనూ మెరుగైన సేవలను నిరాటంకంగా అందిస్తున్నారు. ఈ దవాఖానల్లో నిత్యం సగటున 80-90 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారు.
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల బృందం ఆయా బస్తీ దవాఖానాల్లో కొవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతున్నామని, కొన్ని కేంద్రాల్లో టీకాలు కూడా ఇస్తున్నట్లు బస్తీ దవాఖాన ప్రాజెక్టు ఆఫీసర్ అనురాధ తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ కన్సల్టేషన్, నిర్ధారణ పరీక్షలు, మందులు లభిస్తుండడంతో స్థానికులకు ఆర్థిక ఊరట లభిస్తున్నదని పేర్కొన్నారు.
పలు బస్తీ దవాఖానాల్లో టెలీమెడిసిన్ ద్వారా ఉస్మానియా దవాఖాన వెద్యులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. సోమవారం, శుక్రవారం-డెర్మటాలజీ, గైనకాలజీ, మంగళవారం,బుధవారాల్లో వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, గురువారం-శస్త్రచికిత్సలు, మంగళవారం-ఆప్తామాలజీ, మంగళవారం-ఈఎన్టీ, గురువారం-పీడియాట్రిక్స్, శుక్రవారం-సైకియాట్రీ, శనివారం-ఆర్థోపెడిక్ సేవలు.
సాధారణంగా బస్తీ దవాఖానాకు నిత్యం 80 నుంచి 90 మంది రోగులు వస్తుంటారు. ఎక్కువగా తలనొప్పి, జలుబు, ఒళ్లునొప్పులు, జ్వర బాధితులే అధికం. ఎండ తీవ్రత దృష్ట్యా కొత్తగా అలర్జీ, విరేచనాలు తదితర లక్షణాలతో కూడా ఎక్కువమంది వస్తున్నారు.