మూడున్నర దశాబ్దాల శిక్షకులు.. క్రీడల్లో ఎందరినో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారు.. మెరికల్లాంటి క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేశారు… ఉద్యోగ రీత్యా పదవీ విరమణ పొందారు… రిటైర్ అయ్యాం.. విశ్రాంతి తీసుకుందాం.. లేకపోతే కొడుకు పిల్లలతో హాయిగా గడుపుదాం..అని అనుకోలేదు వారంతా.. చూపు మసకబారుతున్నా చక్కని శిక్షణనిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు సనత్నగర్ బాస్కెట్బాల్ కోచ్లు.
వారంతా వ్యక్తిగత జీవితాల్లో విశ్రాంత ఉద్యోగులు… దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా వారి దినచర్య ఒకేలా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే బాస్కెట్బాల్ మైదానం బాట పట్టడం.. అక్కడ శిక్షణ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే చిన్నారులకు శుభాభినందనలు చెప్పడంతో వారి దినచర్య మొదలవుతుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడమే పనిగా వారు అంకిత భావంతో శిక్షణనిచ్చే బాధ్యతలను నిర్వర్తిస్తారు. వయోభారం మీరుతున్నా, కంటి చూపు మసకబారినా లెక్క చేయరు. అంతా వయసు 60 నుంచి 70 దాటుతున్న వారే.. బాస్కెట్బాల్లో అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గత మూడున్నర దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల శిక్షణలో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వీరి చేతుల్లో రూపుదిద్దుకున్నారు. అంకిత భావంతో బాస్కెట్బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దడాన్ని తమ జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఇటువంటి కోచ్లను సనత్నగర్లో మాత్రమే చూడగలం.. జీహెచ్ఎంసీకి ఆన్లైన్లో చెల్లించే 50 మినహా.. మరే ఇతర రూపంలో ఇక్కడ డబ్బుల ప్రస్తావన ఉండదు.. గ్రేటర్ పరిధిలో వేసవి శిక్షణ శిబిరాల్లోనే కాకుండా అన్సీజన్లో కూడా అత్యధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఉండటం గమనార్హం.
1985లో బాస్కెట్బాల్ క్రీడాకారులు మహ్మద్ సయీద్, నర్సింగ్రాజ్ దండోత్కర్, అంజిబాబు, దివంగత క్రీడాకారుడు సుభాష్లు సనత్నగర్లో ఓ చక్కటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అప్పటి సనత్నగర్ వెల్ఫేర్ గ్రౌండ్స్లో ఓ కోర్టును ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది అంత సౌకర్యవంతంగా లేకపోవడంతో అప్పటి కార్పొరేటర్ సహకారంతో ఎస్ఆర్టీ క్వార్టర్లలో సిమెంట్ కోర్టు, ఫ్లడ్ లైట్లు, క్రీడాకారులకు డ్రెసింగ్ రూమ్లు కలిపి ఓ చక్కటి బాస్కెట్బాల్ గ్రౌండ్ను సాధించుకున్నారు. చక్కటి కోర్టు అందుబాటులోకి రావడంతో ఇక శిక్షణ శిబిరాన్ని పరుగెత్తిస్తూ.. తమ దగ్గర శిక్షణ పొందిన వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్ది చక్కటి ఫలితాలు సాధించారు. ఇప్పటికీ వారు విశ్రాంతిని కోరుకోవడం లేదు.. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు శిక్షణనివ్వడంలో తాము ముందుంటామని చెబుతున్నారు సనత్నగర్ బాస్కెట్బాల్ కోచ్లు.
పలు విద్యాసంస్థల్లో ఫిజికల్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్గా విధు లు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన సనత్నగర్కు చెందిన నర్సింగ్రాజ్ దం డోత్కర్ దాదాపు 70 ఏండ్ల వయసులో కూడా బాస్కెట్బా ల్ గ్రౌండ్స్లో చిన్నారులకు ఫిట్నెస్ అంశాల్లో శిక్షణనిస్తుంటారు. సనత్నగర్ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నర్సింగ్రాజ్ దండోత్కర్ చూపు మసకబారినా… చిన్నారుల శారీరక ధృడత్వానికి దోహదం చేసే వ్యాయామాలు చేయిస్తుంటారు. చిన్నారులు వ్యాయామాలు చేసిన తరువాత గ్రౌండ్స్లో చురుగ్గా కదిలేందుకు తగిన శక్తిని సమకూర్చుకుంటారని ఆయన చెబుతున్నారు.
సనత్నగర్లో బాస్కెట్బాల్ కోచింగ్ తీసుకునేందుకు స్థానికులే కాకుండాఎస్ఆర్నగర్, అమీర్పేట్ పరిసర ప్రాంతాల నుంచి క్రీడాసక్తి ఉన్న వారు వస్తుంటారు. వ్యాపార్మాతక ధోరణికి పూర్తి భిన్నంగా ఇక్కడ అందుతున్న కోచింగ్ పట్ల క్రీడాకారురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ నైపుణ్యం పెంచుకున్న క్రీడాకారులు ఎందరో స్పోర్ట్స్ కోటాలో, ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు దక్కించుకున్నారు. చాలా మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. – మహ్మద్ సయీద్, బాస్కెట్బాల్ కోచ్, సనత్నగర్.
సనత్నగర్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎం.వి.రాజేశ్ జాతీయ జట్టులో స్థానం పొందడమే కాకుండా అంతర్జాతీయంగా చక్కటి క్రీడాకారుడిగా పేరుపొందారు. దాదాపు 20 మందికిపైగా క్రీడాకారులు జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించారు. బాలురకు ధీటుగా బాలికలు కూడా సనత్నగర్ గ్రౌండ్ నుండి తమదైన శైలిలో రాణిస్తున్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ సనత్నగర్ గ్రౌండ్స్లో శిక్షణ పొందుతున్న బాలికలు రాణిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నది. -ఫరీద్, జాతీయ క్రీడాకారులు, బాస్కెట్బాల్