హౌసింగ్ బోర్డు, జహూర్బాగ్కాలనీల్లో ఎమ్మెల్యే అహ్మద్ బాలాల పర్యటన
పలు సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు
పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
సైదాబాద్, మార్చి 17: కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలోని తాగునీటి ట్యాంక్ ఆవరణలో ప్రహరీ ఎత్తును పెంచడానికి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.కాలనీలో వృథాగా ఉన్న క్వార్టర్ను కాలనీవాసులకు ఉపయోగించుకునేలా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలని తహసీల్దార్ ప్రసాద్ రావుకు సూచించారు. మరో ఖాళీ ప్రదేశంలో ఓపెన్ జిమ్, మహిళా పార్కును ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలో రోడ్లపై ప్యాచ్ వర్క్ చేయాలని సూచించారు. కాలనీల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలన్నారు. జహూర్బాగ్ కాలనీ వద్ద రెండున్నర నెలలుగా తాగునీటి లీకేజీ సమస్య పరిష్కారం గుంతను తవ్వ అలాగే వదలివేయటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుం తను తక్షణమే పూడ్చివేసి ఆ సమస్యను పరష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మలక్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, ఏఎంసీ గోవింద్ రెడ్డి, సర్కిల్ ఈఈ మహెబూబ్ మియ్యా, డీఈ బన్సీలాల్, ఏఈ వెంకన్న, వెంటర్నీ డాక్టర్ రాంచంద్రారెడ్డి, హార్టికల్చర్ అధికారి రాంరాజ్, జలమండలి సీజీఎం అశోక్, ఆస్మాన్ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణి, మేనేజర్ శ్రావణ్, వీధిదీపాల అధికారి దుర్గారావు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బాక్స్ డ్రైన్ పనులు పరిశీలన
చాదర్ఘాట్, మార్చి 17: అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల సూచించారు. ఆజంపురా డివిజన్లోని జట్పట్నగర్ చంచల్గూడ వద్ద చేపడుతున్న బాక్స్ డ్రైన్ పనులను గురువారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల జీహెచ్ఎంసీ సీఈ జియావద్దీన్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ రాధిక, డీఈ వేణుగోపాల్, ఎంఐఎం నాయకులు అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.