సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు నగరంలోని 966 మురికి వాడల్లో భరోసా కేంద్రం, అక్షయ విద్యా స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవారం అక్షయ సంస్థ ప్రతినిధులు, బోధన సిబ్బంది హాకాభవన్లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. పేద కుటుంబాలకు చెందిన డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన యువత స్వచ్ఛందంగా ముందుకువచ్చి సింగరేణి కాలనీ, ఎల్బీనగర్, బోరబండ ప్రాంతాలకు చెందిన వారికి భరోసా కేంద్రంలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరై అక్షయ విద్యా ఎన్జీఓ సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్, అధ్యక్షుడు వివేకానంద, అకాడమీ సలహాదారులు అరుంధతీరెడ్డి పేదల అభ్యున్నతికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సంస్థ తరఫున పనిచేస్తున్న వలంటీర్లు పిల్లలకు మంచి, చెడులపై అవగాహన కల్పించాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ట్యూటర్లు మంచి, చెడులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మురికివాడల్లో అక్షయ విద్యతో కలిసి నగర పోలీసులు పనిచేస్తారని, తద్వారా మురికివాడల్లో నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. అదనపు సీపీ శిఖా గోయెల్ మాట్లాడుతూ మురికివాడల్లో సంస్థ తరఫున పనిచేస్తున్న ట్యూటర్స్ సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో భరోసా కేంద్రం ఇన్చార్జి, అదనపు డీసీపీ శిరీషారాఘవేంద్ర పాల్గొన్నారు.