శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8: గచ్చిబౌలిలో దొంగలు బరితెగించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ వాణిజ్య సముదాయంలోని సెంట్రల్ బ్యాంకులో చొరపడ్డారు. బ్యాంకు ముందున్న సీసీ కెమెరా ధ్వంసం చేసి.. కిటికీ అద్దం పగలకొట్టి.. గ్రిల్ తొలగించి..లోనికి ప్రవేశించిన దుండగులు. సీసీ కెమెరా, బ్యాంకు అలారం తీగలను కత్తిరించి.. లోనికి ప్రవేశించారు. రెండున్నర గంటలకు పైగా బ్యాంకులోనే పాగా వేశారు. స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు.
అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఫాల్సీలింగ్ రంధ్రం పెట్టినా..లాభం లేకపోయింది. చివరకు 6 కంప్యూటర్ మానిటర్లు, సీసీటీవీ డీవీఆర్, ప్రింటర్తో ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే చోటు చేసుకోవడం గమనార్హం.
కమిషనర్ కార్యాలయానికి పక్కన ఉన్న ఓ వాణిజ్య సముదాయంలోని మొదటి అంతస్తులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. రోజులాగే బుధవారం ఉదయం 9.30 గంటలకు సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. మానిటర్లు కనిపించకపోవడంతో పాటు కిటికీ తెరిచి ఉండడం, ఫాల్సీలింగ్కు రంధ్రం ఉండటాన్ని గమనించి..బ్రాంచి మేనేజర్కు సమాచారం అందించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
క్లూస్ టీం సభ్యులు బ్యాంకు లోపల, బయట కిటికీ ప్రాంతంలో దుండగుల ఫింగర్ ప్రింట్లు, ఇతర ఆనవాళ్ల నమూనాలు సేకరించారు. మాదాపూర్ ఏసీపీ రఘునందర్ రావు, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్ రెడ్డి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేవలం 6 మానిటర్లు, సీసీటీవీ డీవీఆర్, ప్రింటర్లు చోరీకి గురయ్యాయని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
పక్కా పథకం ప్రకారం దుండగులు రెక్కీ నిర్వహించి.. బ్యాంకు లో చొరబడినట్లు తెలుస్తున్నది. కార్యాలయం ముందున్న సీసీ కెమెరాను ధ్వంసం చేసి..అలారం తీగలు కట్ చేశారు. డీవీఆర్ను సైతం తమ వెంట ఎత్తుకెళ్లారు. అయితే ఈ భవనం మరోవైపు ఉన్న సీసీ ఫుటేజీల్లో చిక్కారు. బుధవారం తెల్లావారుజామున 2.22 గంటలకు ప్రధాన రహదారి అవతలి నుంచి రోడ్డు దాటి.. బ్యాంకు వైపు వచ్చిన ఓ వ్యక్తి, ముఖానికి నిండుగా నల్లటి స్క్రాఫ్ కట్టుకున్న ఓ మహిళ ఇద్దరు కలిసి మొదటి అంతస్తుకు పోవడం.. ఆ తర్వాత అనేకసార్లు ఆ వ్యక్తి బయటకు వచ్చి వెళ్లడం సీసీ పుటేజీలో రికార్డు అయింది.
తెల్లవారుజామున 2.22 గంటల నుంచి ఉదయం 5.07 గంటలకు వరకు అంటే 2.45 నిముషాలు బ్యాంకులోనే ఉన్నారు. తెల్లవారుజామున 5.07 గంటలకు ఆ వ్యక్తి ఓ ట్రాలీ ఆటోను తీసుకొచ్చి.. కవర్లతో నిండిన సామగ్రిని అందులో పెట్టుకొని అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ నమోదయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో వెళ్లిన సమయంలో గచ్చిబౌలి ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు, రోడ్డుకు అవతలి వైపు ఉన్న కెమెరాలను పరిశీలించి.. నిందితులను పట్టుకునేందుకు ముమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు.