బంజారాహిల్స్, జనవరి 24 : స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్యాసినోను తలపించేలా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు జరిపి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం 4లోని రాడిసన్ బ్లూ హోటల్లో రూమ్ నం.319 అద్దెకు తీసుకొని, అందులో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నడిపిస్తున్నారనే సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు జరిపారు.
హోటల్ గదిని అద్దెకు తీసుకుని ఆన్లైన్లో కస్టమర్లను ఆకర్షిస్తూ క్యాసినో తరహాలో టోకెన్లు జారీ చేసి పేకాట శిబిరం నిర్వహిస్తున్న మహబూబ్నగర్కు చెందిన సింగిడి శ్రీనివాస్(44)తో పాటు పేకాడుతున్న మెర్విన్ కార్(35), సయ్యద్ నయీమ్(42), డియో గుర్మీత్సింగ్(33), వి.సంతోష్కుమార్(40), రంగ సాయికృష్ణ(28), ఎస్.శేఖర్(44), బి.వినోద్కుమార్(38), ఎస్.సూర్యచంద్ర(33), ఎం.వినోద్(28), ఎస్.వేణు(25), రుద్ర సరిత(38), జాల్గువ కుమారి(40)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి గాగుల్స్, ఇయర్ఫోన్లు, సెల్ఫోన్లతో పాటు రూ.32,47,000 విలువ చేసే టోకెన్లు, రూ.86,255 ఆన్లైన్ క్యాష్, రూ.2400 నగదును స్వాధీనం చేసుకున్నాడు. కాగా పేకాడుతున్న వారిలో 9మంది నిర్వాహకులు సింగిడి శ్రీనివాస్కు సంబంధించిన వారేనని, మిగిలిన నలుగురిని బోల్తా కొట్టించేందుకే వీరు పేకాట రాయుళ్ల అవతారం ఎత్తినట్లు పోలీసుల విచారణలో తేలింది. సినీ ఫక్కీలో క్యాసినో పేరుతో మోసం చేస్తున్న సింగిడి శ్రీనివాస్ గతంలోనూ పలు ప్రాంతాల్లో ఇదే విధంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.