బంజారాహిల్స్, డిసెంబర్ 2: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిలింనగర్ రోడ్ నం.1లో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకు చెందిన స్థలంపై ఎలాంటి హక్కులేకున్నా.. తనకు సబ్ లీజు ఇవ్వడంతో బాంబే గార్మెంట్స్ పేరుతో స్టోర్ను ఏర్పాటు చేశానని, అడ్వాన్స్గా రూ.13.50లక్షలతో పాటు భారీగా పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ మియాపూర్కు చెందిన కె.ఇందిర గత నెల 15న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నందకుమార్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫరీదాబాద్కు చెందిన బీజేపీ దూత రామచంద్రభారతిపై కూడా బోగస్ ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కూడా రామచంద్రభారతిని విచారించేందుకు కస్టడీకి అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.