బంజారాహిల్స్, డిసెంబర్ 7: మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇటీవల మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను సీబీఐ అధికారులు ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ చేశారంటూ చిగురు ప్రశాంత్ అనే వ్యక్తి ట్విట్టర్తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడు.
ప్రశాంత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సాయితేజ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రశాంత్ ట్విట్టర్ ఖాతాలను పరిశీలించగా.. బొంతు రాంమోహన్తో పాటు ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ తదితరులపై కూడా అనేక రకాల తప్పుడు ప్రచారాలతో ట్వీట్స్ చేసినట్లు తేలింది. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.