బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయింది. మడిగెలను వ్యాపారులకు కేటాయించేందుకు సిద్ధం చేసి దరఖాస్తులు ఆహ్వానించగా 36 మంది అర్హులయ్యారు. వారికి శనివారం మడిగెలుకేటాయించను న్నట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
వీధి వ్యాపారులు రోడ్లపై, ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. దీంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేటషన్ల పరిధిలో సమీకృత మార్కెట్ భవనాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో 40 మడిగెలను నిర్మించారు.
అయితే వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా 101 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 88 గుర్తింపు పొందినవి ఉన్నాయి. వీటిని స్క్రూటిని చేయగా అందులో 36 మంది అర్హులయ్యారు. వీరికి శనివారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన మడిగెలను కేటాయించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మడిగెలు దక్కించుకున్నవారు మొదటి ఆరు నెలల వరకు రూ.1 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. తర్వాత రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇన్నాళ్లు రోడ్లు, ఫుట్పాత్లపై వీధివ్యాపారాలు కొనసాగడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఇప్పుడు వీధి వ్యాపారులకు సమీకృత మార్కెట్లో మడిగెలు కేటాయించి ఒకే చోట వ్యాపారాలు చేసుకునేలా వసతులు కల్పించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. అంతేకాకుండా ప్రజలకు కావాల్సిన సరుకులు అన్నీ ఒకే చోట దొరుకనున్నాయి.