ఉప్పల్ జోన్ బృందం, డిసెంబర్ 3 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. బండారి లక్ష్మారెడ్డి 49,030 వేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో ఉప్పల్, రామంతాపూర్, కాప్రా, చర్లపల్లి, హబ్సిగూడ, నాచారం, చిలుకానగర్, ఏఎస్రావు నగర్, మల్లాపూర్, హెచ్బీకాలనీ డివిజన్లలో గులాబీ శ్రేణులు విజయోత్సవాన్ని నిర్వహించారు. గులాబీ రంగును ఒకరిపై ఒకరు చల్లుకుంటూ బీఎల్ఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అని బిగ్గరగా నినాదాలు చేశారు.
పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి, నృత్యాలు చేశారు. సైనిక్పురిలోని బీఆర్ఎస్ కార్యాల యం ముందు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, అభిమానులు బీఎల్ఆర్ కోసం నిరీక్షించారు. ఆయన రాగానే పూలమాలలతో ముంచెత్తారు. భారీ గజమాలతో సత్కరించారు. బీఎల్ఆర్కు కరచాలనం చేసి.. శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కొంతమంది ఆనందంతో నృత్యాలు చేశారు.
ఉప్పల్ /కాప్రా, డిసెంబర్ 3 : తనపై నమ్మకం ఉంచి మంచి మెజారిటీ తో గెలిపించిన ఉప్పల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, నిజాయితీగా సేవలందిస్తానని ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి అయి, తుది ఫలితాలు వెలువడిన అనంతరం ఎన్నికల అధికారి నుంచి బీఎల్ఆర్ ఎన్నికైన ధ్రువపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ మాట్లాడుతూ .. ఉప్పల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తానని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరుస్తానని అన్నారు. తన గెలుపుకోసం కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
మల్కాజిగిరి జోన్ బృందం, డిసెంబర్ 3: మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్రెడ్డి ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి 49,811ఓట్ల అత్యధికతో గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యక ర్తల సంబురాలు అంబరాన్నంటాయి. బాణాసంచాలు కాల్చుతూ .. మిఠాయిలు పంచిపెట్టారు. మొదటిసారి విజయం సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. విజేత మర్రి రాజశేఖర్రెడ్డికి కార్పొరేటర్లు, నా యకులు, ప్రజలు అభినందనలు తెలిపారు. సంబురాల్లో బీఆర్ఎస్ నాయకులు జీకే హన్మంతరావు, మధు సూదన్రెడ్డి, జీకే శంకర్రావు, శ్రీనివాస్, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.