సిటీబ్యూరో, మే1 (నమస్తే తెలంగాణ): అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.నీటి తొలగింపునకు ప్రత్యేకంగా 128 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయి. అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 60 చోట్ల నేలకొరిగిన చెట్లను క్లియర్ చేశారు. ఎక్కడ ఎలాంటి సంఘటన తలెత్తలేదని అధికారులు పేర్కొన్నారు.
మారేడ్పల్లి లాంటి ప్రాంతాల్లో భారీ చెట్టు విరిగిపడగా.. కారు ఇతర వాహనాలు ధ్వంసమయ్యా యి. డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. భారీ వర్షాలకు 288 ప్రాంతాల నుంచి వరద నీటి సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేయగా..నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో నీరు నిలువకుండా చర్యలు తీసుకుంటున్నామని, వర్షాల వల్ల ఏదైన సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111 నంబరుకు ఫోన్ చేయాలని మేయర్ విజయలక్ష్మి నగరవాసులకు సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెల్లార్ తవ్వకాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నిర్మాణదారులకు పలు సూచనలు జారీ చేస్తూనే సెల్లార్ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సోమవారం నిర్ణయించింది. అన్ని సర్కిళ్ల ఏసీపీలు, డీసీలు తగు చర్యలు చేపట్టాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణాలు చేపట్టే ప్రతి బిల్డర్ రక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ గోడ నిర్మాణం, పని జరుగుతున్న ప్రదేశం చుట్టూ బారికేడింగ్, సెల్లార్లో నీరు నిలువకుండా చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సెల్లార్, సెట్బ్యాక్లను అధికారులు తనిఖీ చేయాలన్నారు.
రక్షణ చర్యలు చేపట్టని సదరు నిర్మాణ దారుడి అనుమతి రద్దుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు తవ్విన సెల్లార్ గుంతలను నిర్మాణ వ్యర్థాలతో నింపేయడం తగదని సూచించారు. ప్రమాదకర సెలార్ల పక్కన, వరద తీవ్రతకు గురయ్యే జనావాసాలను సంబంధిత డీసీలు పర్యవేక్షణలో పోలీసుల సాయంతో ఖాళీ చేయించాలని కమిషనర్ పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా సెల్లార్ల పక్కన కార్మికులకు షెడ్లు నిర్మించడం, ఇతర నిబంధనలను ఉల్లంఘనలు, కార్మికుల అడ్డాల పరిశీలనపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సంబం ధిత బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోనల్ కమిషనర్లు, ప్లానింగ్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ చెప్పారు. వర్షాకాలం మొదలైన రోజు నుంచి పూర్తయ్యే వరకు సెల్లార్ తవ్వకంపై నిషేధం ఉంటుందని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో గ్రేటర్లో రాగల మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షానికి తోడు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. కాగా సోమవారం తెల్లవారుజాము నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 10.6 సెం.మీలు, వెంగళరావునగర్లో 82సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.