హైదరాబాద్, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ) ః మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా పలు షరతులను విధించింది. రూ. 25 వేల విలువైన వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలి. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు లేదా 8 వారాలపాటు ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత ఎస్ హెచ్ ఓ ఎదుట హాజరుకావాలి.
పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. పోలీసులు కోరినప్పుడు హాజరుకావాలి. కింది కోర్టులో పాస్ పోర్టును స్వాధీనం చేయాలి. కింది కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని దాటి వెళ్లరాదు. సాక్షులను ప్రభావితం చేయరాదు. ప్రలోభాలకు గురిచేయకూడదు. కేసు విచారణలో జోక్యం చేసుకోరాదు అంటూ షరతులు విధించింది. మొయినాబాద్లో తనపై అన్యాయంగా డ్రగ్స్ కేసు నమోదు చేశారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రోహిత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ కె. సుజన మంగళవారం విచారించారు.
రోహిత్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది డీఎస్ అనిరుద్ రెడ్డి వాదిస్తూ, కేసు విచారణ పూర్తయిందని, మార్చి 15 నుంచి జైలులోనే ఉన్నారని చెప్పారు. దీనిపై పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు ప్రతివాదన చేస్తూ, బెయిల్ మంజూరు చేస్తే షరతులు విధించాలని కోరారు. తీవ్ర అభియోగాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, పిటిషనర్ రోహిత్ రెడ్డిని పోలీసులు నాలుగుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారని, కొకైన్ కేవలం 0.26 గ్రాములు మాత్రమే ఉందని, పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు ఆధారాలు లేవని, ఈ నేపథ్యంలో షరతులతో బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.