మేడ్చల్, జూన్ 25: నగర శివారులో బద్రీనాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ పేరుతో మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామ శివారులో నిర్మించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉత్తరాఖండ్ వాసులు ఉత్తరాఖండ్ కల్యాణి సంస్థ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసుకొని, నిధులను సమకూర్చుకున్నారు. ఆ నిధులతో నగరానికి సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లా బండ మైలారం, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ శివారులో 1550 గజాల స్థలంలో విశాలమైన ప్రాంగణంతో బద్రీనాథ్ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆలయాన్ని 750 గజాల స్థలంలో నిర్మించారు.
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
ఆలయ నిర్మాణం పూర్తి కావడం ఉత్తరాఖండ్ సంస్థాన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కలశ యాత్ర, గాయత్రీ హవన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికులతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉత్తరాఖండ్ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేలాది మంది మహిళలు, చిన్నారులు తరలివచ్చి, ఆలయాన్ని దర్శించుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విగహ్ర ప్రతిష్ఠ ఈ నెల 29న నిర్వహించనున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఆలయం ఆధ్మాతిక కేంద్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా వృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో విక్రమ్సింగ్ రావత్, రోషన్ సింగ్ నేగి, అనిల్ బండారి, రికేశ్ పెట్వాల్, అనిల్ సింగ్ మాల్, బలవీర్ తదితరులు పాల్గొన్నారు.