మాదాపూర్, నవంబర్ 26: యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి హఫీజ్పేట్లోని ప్రేమ్ నగర్ ఏ, బీ బ్లాక్లో కార్డన్సెర్చ్ నిర్వహించిన అనంతరం మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్తో పాటు పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలతో కలిసి ప్రేమ్నగర్ ఈద్గా ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. యువత సరైన దారిలో నడిచేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, వారు ఏం పనులు చేస్తున్నారో ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు. ఖాళీగా తిరగడం వలన వారి ఆలోచనలు చెడు వ్యసనాలపై పడే అవకాశాలు ఉంటాయని అటువంటి సమయంలో బాధ్యతను పెంచే ఆలోచనలపై దృష్టి మరల్చేలా చేయాలని అన్నారు.
ఆపదలో..100కు సమాచారం ఇవ్వండి
కాలనీల్లో కొత్త వారు అనుమానాస్పదంగా కనిపించిన, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్ అన్నారు. బైక్ చలాన్లు ఉన్నవారు త్వరగా చెల్లించాలని పెండింగ్లో ఉంచుకోవద్దని చెప్పారు. లైసెన్స్లు లేకుండా రోడ్లపైకి రావద్దని కోరారు. ఫోన్కు వచ్చే ఫ్రాడ్ కాల్స్పై ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో మియాపూర్ ఇన్స్పెక్టర్ సామ వెంకటేశ్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాజగోపాల్రెడ్డి, చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రోరెడ్డిలతో పాటు ఎస్సైలు రవికుమార్, రవికిరణ్, భాస్కర్, యాదగిరిలతో పాటు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
రూ. 5 లక్షల 19 వేల 764 పెండింగ్ చలాన్లు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో దాదాపు 200 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హఫీజ్పేట్లోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, బీ బ్లాక్లో ఇంటింటికి తిరుగుతూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానితులుగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పెండింగ్ చలాన్లకు సంబంధించిన 81 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అన్ని ద్విచక్ర వాహనాలు, ఆటోలపై కలిపి మొత్తం రూ. 5లక్షల 19 వేల 764 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించి వాహనాలను తీసుకెళ్లాలని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.