హైదరాబాద్ : ముక్కు పచ్చలారని ఓ వారం రోజుల పసికందును కీసర పరిధిలోని ఆర్జీకే రోడ్డుకు సమీపంలోని చెట్ల పొదల్లో వదిలేశారు. ఆటో డ్రైవర్ జీ వినోద్ గౌడ్ పసికందు ఏడుపు విని కీసర పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో పోలీసులు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనాస్థలికి చేరుకుని మగ శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శిశువుకు చికిత్స అందించి.. నాగారంలోని చైల్డ్ కేర్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్జీకే రోడ్డుతో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు.