సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తాతయ్య చేయి వేశాడు.. అంకుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.. మామయ్య మాయ మాటలతో లొంగదీసుకున్నాడని చెబితే అవన్నీ మర్చిపోమంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను సముదాయిస్తున్నారు. ఇది దారుణాలను మరిచిపోని పిల్లలు మాత్రం బాధతో బతికేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో చలించిపోయిన ఓ మహిళ ‘శ్రేయోభిలాషి’గా ముందుకొచ్చింది. పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడులకు పాల్పడే వారితో అప్రమత్తంగా ఉండేందుకు హైదరాబాద్కు చెందిన కౌముది నాగరాజు 2014లో లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో దాదాపు 15,500 మంది పిల్లలకు సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్లపై అవగాహన కల్పిస్తున్నది.
చట్టాలు, హక్కులపై అవగాహన..
లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు కౌముది నాగరాజు ముందుగా రెయిన్బో హోమ్స్ (అనాథ, సింగిల్ పేరేంట్, జువనైల్, వీధుల్లో నివాసం ఉండే) పిల్లలను ఎంచుకున్నారు. ఈ హోమ్స్లో ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం డిజిటల్ తరగతులను నిర్వహించి వ్యక్తిగత భద్రతపై చర్చించారు. యుక్త వయసు వారికి కామాంధులు ఎలాంటి మాటలు చెబుతారు? జరిగిన లైంగిక దాడిని బయటికి చెప్పకుండా ఎలా భయపెట్టిస్తారు? మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు.. హక్కులపై 1500 మందికి పూర్తి అవగాహన కల్పించారు. అంతేకాక నాంపల్లి, ఖైరతాబాద్ పరిధిలోని దాదాపు 85 ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న సుమారు 14 వేల మంది విద్యార్థులను లైంగిక దాడుల నుంచి కాపాడుకునేలా చైతన్య పరిచారు.
పిల్లలపైనే లైంగిక దాడి ముప్పు అధికం..
చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వారు పిడోఫిలియా అనే రుగ్మతతో బాధపడుతుంటారు. అలాంటి వారిని పిడోఫిలిస్ అని పిలుస్తారు. ఈ రుగ్మతతో బాధపడేవారు వెంటనే మానసిక వైద్యులను సంప్రదించి ఆ ఫోబియా నుంచి బయటపడొచ్చు. కాని కొంత మంది దాన్ని దాచిపెట్టుకుంటారు. పిల్లలపై లైంగిక దాడికి తెగబడుతుంటారు. వయసు ఆధారంగా మాయ మాటలు చెప్పడం, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అవకాశంగా తీసుకొని వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.
చైతన్యంతోనే చెక్..
పిల్లలపై జరిగే అకృత్యాలు, అఘాత్యాలు, లైంగిక దాడులను అరికట్టాలంటే ముందుగా వారిలో చైతన్యం నింపడమే ఆయుధంగా భావించాం. ఇందుకోసమే లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాం. పిల్లలకు సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్లపై వివరిస్తున్నాం. మొత్తంగా 15 వేలకు పైగా పిల్లలను అప్రమత్తం చేశాం. ఈ బాలల దినోత్సవం నుంచి వారం రోజుల పాటు పిల్లల భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం.
-కౌముది నాగరాజు, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు